కౌలుదారులకు ఇక ప్రభుత్వ రాయితీలు

Bill Passed In The State Legislature To Get All Kinds Of Assistance To Tenant Farmers - Sakshi

కౌలు రైతుల చట్టానికి సవరణలు

అసెంబ్లీలో బిల్లు ఆమోదం 

అందనున్న పలు రాయితీలు

భూ యజమానుల హక్కులకు భంగం కలగకుండా చర్యలు

సాక్షి, కడప అగ్రికల్చర్‌ : కౌలు రైతులకు అన్ని రకాల సాయం అందేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ముసాయిదా బిల్లు శాసనసభలో గురువారం ఆమోదం పొందింది. ఇక కౌలు రైతుల కష్టాలు తీరినట్లేనని చెప్పవచ్చు. భూ యజమానుల హక్కులకు భంగం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ ఏడాది నుంచి కౌలు రైతులకు మేలు చేస్తూ.. శాసనసభలో బిల్లుకు శాసన సభ్యులు ఆమోదం తెలిపారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే కౌలుదారుల (గుత్త రైతుల) రక్షణకు చట్టబద్ధమైన భరోసా కల్పిస్తామని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఇప్పుడు ఆ దిశగా ప్రస్తుత చట్టానికి సవరణలు తీసుకొస్తున్నారు. దీంతో పలు ప్రభుత్వ రాయితీలు తమకు దక్కనుండటంతో జిల్లాలోని కౌలుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

నాటి చట్టంలో..
ఉమ్మడి రాష్ట్రంలో నాటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ ఆధీకృత కౌలు రైతుల చట్టం–2011 తీసుకొచ్చారు. అయితే ఈ చట్టంలో ఉన్న అనేక లొసుగుల కారణంగా అమలులో ఆశించిన ఫలితాలు సాధ్యం కాలేదు. ప్రధానంగా భూమిని కౌలుకు ఇస్తున్నట్లు యజమానులు రాత పూర్వకంగా ఇచ్చేందుకు అంగీకరించలేదు. యజమాని మౌఖిక అంగీకారంతో రెవెన్యూ గ్రామ సభల ద్వారా కౌలుదారులను గుర్తించి రుణ అర్హత కార్డులు (ఎల్‌ఈసీలు) పంపిణీ చేస్తున్నారు. ఎల్‌ఈసీ కాలపరిమితి జూన్‌ 1 నుంచి మే 31 వరకు ఉంటుంది. కౌలుదారులు భూమిపై హక్కును క్లెయిమ్‌ చేసుకోవడానికి లేదా సమర్పించుకోవడానికి రుణ అర్హత కార్డు సాక్ష్యంగా ఉపయోగించరాదని చట్టంలో పొందుపరిచారు. అలాగే అడంగల్‌లో అనుభవదారునిగా కూడా కౌలుదారు పేరును నమోదు చేయరు. కౌలుదారులకు ఎల్‌ఈసీల ద్వారా ఇచ్చే రుణం కేవలం పంటపై మాత్రమేనని, భూమిపై కాదని ప్రభుత్వం ఆ చట్టంలో స్పష్టంగా పేర్కొంది. భూ యజమానులకు ఇన్ని రక్షణలు కల్పించినప్పటికీ.. కౌలుదారుల కంటే ముందే బ్యాంకులకు వెళ్లి పంట రుణాలు పొందుతున్నారు.

అందువల్ల కౌలుదారులకు పంట రుణాలు, బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ తదితర ప్రభుత్వ రాయితీలు అందకుండా పోయాయి. జిల్లాలో సుమారు లక్ష మంది వరకు కౌలు రైతులు ఉంటారని అనధికార అంచనాలు చెబుతున్నాయి. అయితే ఏనాడూ రెవెన్యూ గ్రామసభల ద్వారా 20 వేలకు మించి కౌలు రైతులను గుర్తించలేదు. కౌలు రైతులకు ఇచ్చిన ఎల్‌ఈసీలు, వారికి అందిన పంట రుణాల గణాంకాలను పరిశీలిస్తే.. ఈ చట్టం ఎంత అధ్వానంగా అమలు జరుగుతుందో అర్థమవుతుంది. గతేడాది రెన్యువల్, కొత్తగా కలుపుకొని 12 వేల మందికి రుణ అర్హత కార్డులు మంజూరు చేయగా, అందులో 883 మందికి వివిధ బ్యాంకుల ద్వారా రూ.10.17 కోట్ల పంట రుణాలు అందాయి. ఈ ఏడాది జూన్‌ ఆఖరు వరకు 322 మంది కౌలు రైతులకు రూ.2.93 కోట్ల పంట రుణాలు ఇచ్చారు. 2011లో ఏపీ ఆధీకృత రైతుల చట్టం వచ్చినప్పటి నుంచి ఇప్పటి దాకా జిల్లాలో సుమారు 15 వేల మంది రైతులకు పంట రుణాలు అందాయని బ్యాంకర్లే స్పష్టం చేస్తున్నారు.  

ఎన్నో ప్రయోజనాలు
భూ యజమానుల హక్కులకు భంగం కలగకుండా ముఖ్యమంత్రి, మంత్రి వర్గం నిర్ణయాలు తీసుకుని కౌలు రైతులకు మేలు చేస్తూ శాసనసభలో బిల్లు ఆమోదం పొందేలా చేశారు. దాన్నే చట్టంగా తీసుకురానున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా.. కౌలు రైతులకు రైతు భరోసా కింద ఏడాదికి రూ.12,500 వడ్డీలేని పంట రుణాలు, పంటల బీమా.. కరువు, అధిక వర్షాల వల్ల పంటలు నష్టపోతే ఇచ్చే ఇన్‌పుట్‌ సబ్సిడీ వర్తింపు, విపత్తుల సహాయ నిధి, ధరల స్థిరీకరణ నిధి, విత్తనాలు, ఎరువుల సబ్సిడీ తదితరాలు వర్తించేలా, ప్రయోజనాలు ఒనగూరేలా చర్యలు తీసుకున్నారు. ఆ మేరకు సభలో బిల్లు ఆమోదం పొందేలా చేశారు. దీనిపై చట్టం తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. 

కౌలు రైతులకు ఎంతో మేలు
రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన బిల్లు కౌలు రైతులకు ఎంతో మేలు చేసేదిగా ఉంది. గతంలో ఈ చట్టం ఉన్నా.. కౌలు రైతులకు ఉపయోగపడేది కాదు. ఇప్పుడు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తీసుకుంటున్న నిర్ణయం చాలా బాగుంది. కౌలు రైతులు భూములను గుత్తకు తీసుకుని పంటలు పండించే సమయంలో వర్షా భావం వల్లనో, అకాల వర్షాల వల్లనో పంటలు దెబ్బతింటే ఒక్క రూపాయి వచ్చేది కాదు. ఇప్పుడు చేయబోయే చట్టం వల్ల కౌలు రైతులకు మేలు జరుగుతుంది.                        – వెంకటరమణ, కౌలు రైతు, సుండుపల్లె

మంచి రోజులు వచ్చినట్లే
కౌలు రైతులు గత ప్రభుత్వాలలో చాలా ఇబ్బంది పడ్డారు. వ్యవసాయశాఖ అమలు చేసే ఏ పథకం వర్తించేది కాదు. సబ్సిడీలు అమలు చేసే నాథుడే లేడు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే చర్యలు తీసుకుని కౌలు చట్టం చేస్తున్నట్లు ప్రకటించారు. అదే విధంగా రైతు భరోసా పథకం వర్తిస్తుందని ప్రకటించడం సంతోషంగా ఉంది.
– వీరబ్రహ్మం, కౌలురైతు, గోనుమాకులపల్లె, వీఎన్‌ పల్లె మండలం

చట్ట సవరణతో రాయితీలు
రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదించిన ముసాయిదా బిల్లు చట్ట రూపం దాలిస్తే.. కౌలు రైతులకు 11 నెలలపాటు చెల్లుబాటు అయ్యేలా భూ యజమానులతో సాగు ఒప్పంద పత్రాలు గ్రామ సచివాలయాల్లో రాసుకునేందుకు వీలు కల్పిస్తారు. ఇందువల్ల కౌలు రైతులకు అనేక ప్రభుత్వ రాయితీలు అందనున్నాయి. ఒప్పంద పత్రాలు కలిగిన కౌలు రైతులకు వైఎస్సార్‌ రైతు భరోసా పథకంలో ఉన్న అన్ని అంశాలు వర్తిస్తాయని ప్రభుత్వం ప్రకటించింది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top