
బెజవాడ దుర్గమ్మకు కానుకల వెల్లువ
బెజవాడ దుర్గమ్మకు బంగారు ఆభరణాలు చేయించి ఇచ్చేందుకు భక్తులు పోటీపడుతున్నారు.
సాక్షి, విజయవాడ: బెజవాడ కనక దుర్గమ్మకు కానుకలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా బంగారు ఆభరణాలు చేయించి ఇచ్చేందుకు భక్తులు పోటీపడుతున్నారు. హెటిరో గ్రూపు తరఫున బండి పార్థసారథిరెడ్డి అమ్మవారికి రూ.4 కోట్లతో స్వర్ణకవచం, కిరీటం, ముక్కుపుడక, బులాకీ, బంగారు చేతులు తయారు చేయిస్తున్నారు. వీటిని దసరా ముందు బహూకరిస్తే పండుగ తొలి రోజు అమ్మవారికి అలంకరిస్తారు. ఆర్వీఆర్ అసోసియేట్స్ రూ. కోటితో ఆలయానికి బంగారు వాకిలి చేయిస్తున్నట్లు ఈవో సూర్యకుమారి తెలిపారు. ఇది కూడా దసరా ఉత్సవాల నాటికి పూర్తవుతుందని సమాచారం. అమెరికాలోని డల్లాస్ నగరంలో ఉంటున్న ఎన్ఆర్ఐ డాక్టర్ అర్చన రూ. 50 లక్షలతో వజ్రాల నెక్లెస్ చేయించనున్నారు.
కాగా ఈ ఏడాది దసరా 11 రోజులు అమ్మవారి అలంకారాల కోసం 11 పట్టు చీరలను డాక్టర్ అర్చన చెన్నైలో ప్రత్యేకంగా నేయిస్తున్నారు. ఈ నెల 29న అమ్మవారికి విరాళాలు ఇచ్చే దాతలతో శోభాయాత్రను నిర్వహించాలని ఆలయ అధికారులు భావిస్తున్నారు. అదే రోజు అమ్మవారికి బహూకరించే ఆభరణాలు ప్రదర్శిస్తారు.