ఈసారి గుణ‘పాఠం’ | Andhra Pradesh Elections Books Distribution | Sakshi
Sakshi News home page

ఈసారి గుణ‘పాఠం’

Apr 21 2019 10:47 AM | Updated on Apr 21 2019 10:47 AM

Andhra Pradesh Elections Books Distribution - Sakshi

కడప ఎడ్యుకేషన్‌: ఈసారి స్కూళ్లు తెరిచే సమయానికి పాఠ్య పుస్తకాలు చేతికందేలా ఉన్నాయి. గతం నుంచి నేర్చుకున్న పాఠాలతో అధికారులు తొందరగా మేలుకొన్నారు. ఒక అడుగు ముందుకేశారు.  వేసవి సెలవులు ముగిసేలోపే పాఠ్యపుస్తకాలను తెప్పించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే మొదటి విడత పుస్తకాలను జిల్లాకు చేరాయని విద్యాశాఖాధికారులు చెబుతున్నారు.  ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈ ఏడాది పాఠ్యపుస్తకాల కొరత లేకుండా జూన్‌ నాటికి స్కూల్స్‌ పాయింట్లకు చేర్చేందుకు విద్యాశాఖ ముందస్తు కసరత్తు చేస్తోంది.

గత మూడు, నాలుగేళ్ల నుంచి విద్యాసంవత్సరం ప్రారంభమై నెలలు గడిచినా అరకొరగానే పాఠ్యపుస్తకాలు అందేవి. ఈ విద్యా సంవత్సరంలో మాత్రం ఇలాంటి ఇబ్బందులేవీ తలెత్తకూడదని విద్యాశాఖ కరసత్తు మొదలు పెట్టి సకాలంలో చేర్చేందుకు శ్రీకారం చుట్టింది. వేసవి సెలవులు ముగిసే నాటికే ప్రింటర్ల నుంచి జిల్లా కేంద్రానికి ..అక్కడి నుంచి మండల వనరుల కేంద్రానికి పాఠ్య పుస్తకాలను చేర్చనుంది. తర్వాత పాఠశాలలువెంటనే విద్యార్థులకు అందజేసే విధంగా చర్యలు చేపట్టనున్నట్లు తెలిసింది. 

2017– 18 యూడైస్‌ ప్రకారం....
జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 2542, ప్రాథమికోన్నత పాఠశాలలు 272, ఉన్నత పాఠశాలలు 391 ఉన్నాయి. వీటిలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులు 91,750 మంది కాగా, ప్రాథమికోన్నత పాఠశాలలు    –
విద్యార్థులు 18,013 మంది ఉంటున్నారని అంచనా. అలాగే ఉన్నత పాఠశాలల్లో 92,769 మంది చదువుతున్నారు. గతేడాది ఈ సమయానికి ముద్రణ పక్రియనే మొదలు కాలేదు. ఆలస్యంగా పుస్తకాలు రావడంతో పాఠ పుస్తకాలతోనే చదువులు కొనసాగించాల్సి వచ్చింది. దీంతో విద్యాశాఖ తీవ్ర విమర్శలు ఎదుర్కొంది.

 2019–20 విద్యా సంవత్సరానికి మొదటి విడతలో భాగంగా ఈనెల 18 నుంచి పాఠ్య పుస్తకాలు జిల్లా కేంద్రంలోని గోడౌన్‌కు చేరుకుంటున్నాయి. ఇందులో 2వ తరగతికి  ఇంగ్లీస్‌ రీడర్‌కు సంబంధించి 15.065 పుస్తకాలు,  8వ తరగతి ఫిజికల్‌ సైన్సు (ఇంగ్లీష్‌ మీడియం) 9641 పుస్తకాలు వచ్చాయి.  9వ తరగతి( తెలుగు మీడియం) సోషల్‌ పుస్తకాలు 7678 వచ్చాయి.  రెండు మూడు రోజులలో తక్కిన పుస్తకాలు రానున్నాయి. మే చివరికల్లా అన్ని పుస్తకాలు జిల్లాకు రానున్నట్లు విద్యాశాఖ వర్గాలు తెలిపారు. 

50 శాతం మేర రాగానే పంపిణీ ప్రారంభం:
పాఠ్యపుస్తకాలకు సంబంధించి మన జిల్లాకు రావాల్సిన పాఠ్యపుస్తకాల్లో సగం పుస్తకాలు జిల్లాకు రాగానే పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ఈ ఏడాది సకాలంలోనే పాఠ్యపుస్తకాలను అందించేందుకు కృషి చేస్తాం.     – పి. శైలజ, జిల్లా విద్యాశాకాధికారి

Advertisement
 
Advertisement
Advertisement