నిశ్చితార్థానికి వచ్చి పెళ్లికొడుకు పరార్ | And groom engagement parar | Sakshi
Sakshi News home page

నిశ్చితార్థానికి వచ్చి పెళ్లికొడుకు పరార్

Feb 22 2014 2:03 AM | Updated on Sep 2 2017 3:57 AM

తాంబూలలు మార్చుకుని లగ్నపత్రిక రాయించుకునేందుకు వచ్చి పెళ్లికుమారుడు మాయమైపోయిన సంఘటన గుడివాడలో చోటు చేసుంది.

  • పెళ్లికుమార్తె తరపు బంధువుల ఆగ్రహం
  •  పెళ్లి కుమారుడి తరపు బంధువుల నిర్బంధం
  •  పోలీస్‌స్టేషన్‌కు చేరిన పంచాయతీ
  •  గుడివాడ, న్యూస్‌లైన్ : తాంబూలలు మార్చుకుని లగ్నపత్రిక రాయించుకునేందుకు  వచ్చి పెళ్లికుమారుడు మాయమైపోయిన సంఘటన గుడివాడలో చోటు చేసుంది.   పెళ్లి కుమార్తె తరపువారు అన్ని ఏర్పాట్లు చేసుకుని చివరి నిమిషంలో పెళ్లి కొడుకు రాకపోయేసరికి అతని తరఫున వచ్చిన పెళిలపెద్దల్ని నిర్భంధించారు. పట్టణంలోని నాగన్న చెరువు వద్ద జరిగిన ఈసంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి...

    పట్టణంలోని బంటుమిల్లి రోడ్డులో ఉన్న నాగన్న చెరువు ప్రాంతానికి చెందిన ఓ యువతికి  విజయవాడకు సమీపంలోని గొల్లపూడి పరిధిలోని నల్లగుంట ప్రాంతానికి చెందిన ఓరుగంటి శ్రీను కుమారుడు ఓరుగంటి సాయితో వివాహం జరిపేందుకు పెద్దలు నిశ్చయించారు. ఈ మేరకు పెళ్లి చూపులు పూర్తయ్యి పెళ్లి కుమారుడి ఇంటివద్ద పప్పన్నాలు తిన్నారు. రూ.60వేలు వరకట్నంగా మాట్లాడుకోగా అందులో రూ.20వేలు ముందుగానే తీసుకున్నారు.  

    గురువారం గుడివాడలో పెళ్లికూతురు ఇంటివద్ద తాంబూలాలు మార్చుకుని లగ్న పత్రిక రాయించుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. పెళ్లి కూతురు ఇంటివద్ద భోజనాలు సిద్ధం చేశారు. విజయవాడ నుంచి పెళ్లి కొడుకు సాయి తాలూకా పెద్దలతో కలిసి గుడివాడకు రైలులో బయలు దేరారు.  అయితే గుడివాడ రైల్వేస్టేషన్లో దిగిన కుటుంబసభ్యలకు పెళ్లి కొడుకు కనిపించకుండా పోయాడు. పెళ్లి పెద్దలు, పెళ్లి కొడుకు తండ్రి శ్రీనులు రైల్వేస్టేషన్, పరిసర ప్రాంతాల్లో వెదికినా కనిపించలేదు.  

    గురువారం సాయంత్రానికి నాగన్న చెరువు వద్ద ఉన్న పెళ్లికూతురు ఇంటికి పెళ్లి పెద్దలు వెళ్లారు. పెళ్లి కొడుకు ఎక్కడని ప్రశ్నిస్తే వెళ్లి పోయాడని చెప్పారు.  ఆగ్రహించిన పెళ్లి కూతురు బంధువులు వచ్చిన పెద్దల్ని నిర్భంధించారు.  కట్నం అడ్వాన్సుగా తీసుకుని చివరి నిమిషంలో ఇలా చేయడం ఏమిటని ప్రశ్నించారు. చివరికి గురువారం అర్ధరాత్రి 2గంటల సమయంలో స్థానిక టూటౌన్ పోలీసు స్టేషన్‌కు చేరారు. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు పెద్దల్ని విచారిస్తున్నారు.  పెళ్లికూతురు ఎత్తు తక్కువగా ఉందని, ఈ పెళ్లి తనకు ఇష్టం లేదని సహచరులతో చెప్పాడని కుటుంబసభ్యులు పోలీసులకు తెలిపారు.
     

Advertisement
 
Advertisement
Advertisement