ప్రపంచం గర్వించదగ్గ బౌద్ధ సంస్కృతికి నిలయమైన అమరావతి విదేశీయులు నిర్మించే వ్యాపార కేంద్రంగా మారకూడదని దళిత ఉద్యమనేత డాక్టర్ కత్తి పద్మారావు అన్నారు.
గుంటూరు : ప్రపంచం గర్వించదగ్గ బౌద్ధ సంస్కృతికి నిలయమైన అమరావతి విదేశీయులు నిర్మించే వ్యాపార కేంద్రంగా మారకూడదని దళిత ఉద్యమనేత డాక్టర్ కత్తి పద్మారావు అన్నారు. గుంటూరులో జాషువా 120వ జయంతి ఉత్సవ సభలో పాల్గొన్న కత్తి పద్మారావు మాట్లాడుతూ బౌద్ధ సంస్కృతి గురించి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుకు ఏం తెలుసునని ప్రశ్నించారు. ధనవంతులకే పరిమితమై పేద, ధనిక అంతరాలను మరింతగా పెంచే వాణిజ్య రాజధాని తెలుగు ప్రజలకు అవసరం లేదని, అన్ని వర్గాల ప్రజలు కలసిమెలసి సంతోషంగా జీవించే ప్రజా రాజధాని కావాలని స్పష్టం చేశారు. జాషువా రచనల స్ఫూర్తితో పేద, పీడిత, కార్మిక, కర్షక వర్గాలు ఇందు కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.
గుంటూరు జిల్లాలో ఉన్న భూముల్లో 90 శాతం సీఎం చంద్రబాబు నాయుడు వర్గానికి చెందిన అగ్ర వర్ణాల చేతుల్లోనే ఉన్నాయని చెప్పారు. మన రాష్ట్రంలో రాజధానిని నిర్మించే ఇంజినీర్లు లేరన్నట్లు చంద్రబాబు సింగపూర్ వెళ్లి అక్కడి పాలకులను బతిమాలుతున్నారని, అమరావతిని రాజధానిగా తీర్చిదిద్దగల సామర్థ్యం తెలుగు ఇంజినీర్లకు ఉందన్నారు. రైతుల నుంచి భూములు లాక్కుని తిరిగి వారికే పెన్షన్ ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు.