‘కార్పొరేట్‌ ఆస్పత్రికి ధీటుగా తీర్చిదిద్దాలి’

Alla Nani Speech In West Godavari District - Sakshi

సాక్షి, ఏలూరు:  ప్రభుత్వ ఆస్పత్రిని.. కార్పొరేట్‌ ఆస్పత్రికి ధీటుగా తీర్చిదిద్దాలని ఉప ముఖ్యమంత్రి, వైద్య , ఆరోగ్య శాఖమంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. శుక్రవారం ఏలూరులోని ప్రభుత్వ ఆస్పత్రి అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆస్పత్రిలో పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా డాక్టర్లు, ఆస్పత్రి సిబ్బందితో కూడిన ఖాళీ పోస్టుల వివరాలను అందించాలని సూచించారు. దీంతోపాటు ఆస్పత్రిలో అవినీతిపై పలు కథనాలు వచ్చాయని.. ఆ ఘటనలోని సిబ్బందిపై చర్యలు తీసుకోవాలన్నారు. 

ఆరోపణలను ఎదుర్కొంటున్న ఎమ్‌ఎన్‌ఓను సస్పెండ్‌ చేసి.. ఏఎన్‌ఎమ్‌కు షోకాజ్‌ నోటీసులు ఇవ్వాలన్నారు. రోగుల ఫిర్యాదుపై దృష్టి సారించి సమస్యలు పరిష్కరించాలని చెప్పారు. దీంతోపాటు ఆస్పత్రి సిబ్బందిపై ఫిర్యాదులు వస్తే సహించేది లేదని హెచ్చరించిన ఆళ్ల నాని.. అదేవిధంగా ఆస్పత్రిలోని అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థను నిర్మించాలన్నారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో జరిగే ఆపరేషన్‌ వివరాలను అధికారులను అడిగి మంత్రి తెలుసుకున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top