
మొక్కుబడి
పలకా బలపం పట్టాల్సిన చేతులు మోటార్ మెకానిక్ షెడ్లలో, ఇటుక బట్టీల్లో, రోడ్లపై చెత్తాచెదారాల్లో కాగితాలు ఏరుకుంటూ, రద్దీ ప్రదేశాల్లో భిక్షాటన చేసుకుంటూ జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో దర్శనమిస్తూనే ఉన్నాయి.
పలకా బలపం పట్టాల్సిన చేతులు మోటార్ మెకానిక్ షెడ్లలో, ఇటుక బట్టీల్లో, రోడ్లపై చెత్తాచెదారాల్లో కాగితాలు ఏరుకుంటూ, రద్దీ ప్రదేశాల్లో భిక్షాటన చేసుకుంటూ జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో దర్శనమిస్తూనే ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే విద్యాహక్కు చట్టం గానీ, లేబర్ ఆఫీసర్లు గానీ వారికి విముక్తి కలిగించడం లేదనే తెలుస్తోంది. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ప్రవేశపెట్టిన కార్యక్రమాలు, చట్టాలన్నీ మొక్కుబడిగా పెట్టినట్లే కనిపిస్తున్నాయి.
విజయనగరం అర్బన్, న్యూస్లైన్: బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ఎన్రోల్మెంట్ డ్రైవ్, చదువుల పండగ, బడిబా ట, విద్యాపక్షోత్సవాలు, వారోత్సవాలు, విద్యా సంబరాలు.. ఇలా గత పదేళ్లలో ప్రభుత్వం అనే క కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో ఏ ఒక్కటైనా సరిగ్గా అమలైతే బడి ఈడు పిల్లలు బడిలో నే ఉండేవారు. కానీ అలా జరగడం లేదు. ప్రధానంగా ఐదేళ్ల క్రితం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన విద్యాహక్కు చట్టం అమలుకు నోచుకోకపోవడం బాలలకు శాపంగా మారింది. ఇప్పటికీ దాదాపు బడి బయట పదివేల మంది పిల్లలున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలోని సాలూ రు, పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాల్లో ని పలు మండలాల్లో నిరక్షరాస్యులు, బాలకార్మికులు అధికంగా ఉన్నట్లు సర్వేలు చెబుతున్నా యి. జిల్లా కేంద్రంలో సైతం బడికి వెళ్లని పిల్లలు వందల సంఖ్యలోనే ఉంటారని లెక్కలు చెబుతున్నాయి. విద్యాహక్కు చట్టంలో భాగంగా బాలకార్మికులను బడిలో చేర్పించేందుకు పట్టణ శివారు ప్రాంతాల్లో స్పెషల్ స్కూళ్లను ఏర్పాటు చేసిన అధికారులు ఆ తర్వాత పట్టించుకోలేదు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే అటువంటి చర్యల ఊసే లేదు.
పొంతన లేని లెక్కలు....
బడి బయట ఉన్న పిల్లల గుర్తింపు కోసం జిల్లాలో ఏటా చేస్తున్న సర్వేలు ఏ మాత్రం నమ్మశక్యం గా ఉండడం లేదు. ప్రతి బడి ఈడు పిల్లవాడి పేరును చేర్చుకుంటున్న అధికారు లు ఆ పిల్లలు ఆసాంతం బడికి వస్తున్నారో? లేదో? పర్యవేక్షించడం లేదు. ప్రత్యేకించి ఈ సమస్య వల్ల బడిలో చేర్పించిన పిల్లలు తిరిగి బయటకు వెళ్లిపోతున్నారు. ఏడాదికేడాది బడి బయటి పిల్లల విషయంలో ఒక్కొక్క సర్వే ఒక్కో రకంగా ఉంటోంది. జిల్లాలో 1,825 మంది బాల కార్మికులు బడికి దూరంగా పనుల్లో కొనసాగుతున్నారని విద్యాశాఖ అధికారుల తాజా నివేదిక లు చెబుతుండగా, ఆ సంఖ్య ఆరు వేలు ఉంద ని సాక్షర భారత్ కార్యకర్తలు గత ఏడాది నిర్వహించిన సర్వే చెబుతోంది. ఇక స్వచ్ఛంద సంస్థ లు చెబుతున్న నివేదికలైతే మరోలా ఉన్నాయి. దాని ప్రకారం అర్బన్, రూరల్ ప్రాంతాల్లో కలి పి 9 వేల నుంచి 10 వేల మంది వరకు పిల్లలు బడి బయట ఉన్న విషయం బయటపడింది.
నెరవేరని విద్యాహక్కు చట్టం లక్ష్యం
సంపూర్ణ అక్షరాస్యతే లక్ష్యంగా ప్రభుత్వం రూపొందించిన విద్యాహక్కు చట్టంతోనైనా నిరుపేద కుటుంబాల్లోని పిల్లలకు విద్యాగంధం అందించాలనే ప్రభుత్వ లక్ష్యం పేద విద్యార్థుల దరిచేరడం లేదు. ఐదేళ్ల క్రితం విద్యాహక్కు చట్టాన్ని పార్లమెంటు ఆమోదించింది. పిల్లలు బడికి, పెద్దలు పనికి అనే నినాదంతో విద్యాహక్కు చట్టానికి మరింత పదును పెట్టి పెద్ద మొత్తం నిధులను ఖర్చు చేస్తున్నా అనుకున్న లక్ష్యానికి చేరువ కాకపోవడంతో పలువురు విద్యావేత్తలు ఆందోళన చెందుతున్నారు. 2015 నాటికి పిల్లలందరికీ ప్రాథమిక విద్యను అందించేలా చర్యలు తీసుకోవాలని 2000 సంవత్సరంలో జరిగిన ప్రపంచ విద్యావేదిక అభిప్రాయపడింది. దీంతో మనదేశం, మరో అడుగు ముందుకు వేసి అందరికీ విద్యను అందిస్తామని ప్రతినబూనడంతోపాటు 2009, ఆగస్టు 27న పార్లమెంటులో విద్యాహక్కు చట్టాన్ని ఆమోదించింది. 2010 ఏప్రిల్ నుంచి ఈ చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తోంది. చట్టాలు రూపొందించి అమలు చేయడంలో పాలకప్రభుత్వాలు వివక్ష చూపడం వల్లే నేటికీ ఉచిత నిర్బంధ విద్య అమలు కావడం లేదు. ఫలితంగా బాలకార్మికుల సంఖ్య పెరుగుతూ, నిరక్షరాస్యుల శాతం కూడా అదేస్థాయిలో పెరుగుతోంది. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే మరో విద్యాసంవత్సరంలోగా జిల్లాలో సంపూర్ణ అక్షరాస్యత సాధించాలనేది కలగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది.