అట్టుడికిన జిల్లా | all areas jac calls bandh in kurnool district | Sakshi
Sakshi News home page

అట్టుడికిన జిల్లా

Oct 4 2013 1:11 AM | Updated on Sep 5 2018 4:10 PM

టీనోట్ నేపథ్యంలో ఉద్యమం తారా స్థాయికి చేరుకుంది. గురువారం జిల్లా వ్యాప్తంగా సమైక్యవాదులు కదంతొక్కారు. పంచాయతీ రాజ్ ఉద్యోగులు వందలాది మంది జిల్లా పరిషత్ నుంచి సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేస్తూ కృష్ణదేవరాయల సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు

టీనోట్ నేపథ్యంలో ఉద్యమం తారా స్థాయికి చేరుకుంది. గురువారం జిల్లా వ్యాప్తంగా సమైక్యవాదులు కదంతొక్కారు. పంచాయతీ రాజ్ ఉద్యోగులు వందలాది మంది జిల్లా పరిషత్ నుంచి సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేస్తూ కృష్ణదేవరాయల సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాజ్‌విహార్ సెంటర్‌లో మానవహారం నిర్మించారు. వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగులు ఎన్‌టీఆర్ సర్కిల్‌లో ధర్నా చేపట్టారు. ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ ఉద్యోగులు, మునిసిపల్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఎమ్మిగనూరులోని సోమప్ప సర్కిల్‌లో ప్రైవేట్ విద్యా సంస్థల జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో, ధర్నా నిర్వహించి పట్టణ బంద్ పాటించారు. ఆదోనిలో సమైక్య రాష్ట్ర పరిక్షణ వేదిక ఆధ్వర్యంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు పట్టణంలో భారీ ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. పాతబస్టాండ్ కూడలి వద్ద పట్టణ జేఏసీ ఆధ్వర్యంలో చేనేత మహిళలు, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వద్ద విద్యార్థులు ఉపవాస దీక్ష చేపట్టారు. నంద్యాల మండలం శివపురంలో సమైక్యాంధ్రకు మద్దతుగా రైతులు దీక్ష చేశారు. 300 తప్పెట్లతో మాదిగపేట వాసులు ర్యాలీ నిర్వహించారు. విద్యుత్‌శాఖ, నీటి పారుదల శాఖ ఆద్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. హొళగుందలో ఉపాధ్యాయులు శ్రమదానం చేశారు. ప్యాపిలి, వెల్దుర్తిలో జేఏసీ దీక్షలు కొనసాగుతున్నాయి. ఆత్మకూరులో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి ఇంటి వద్ద రిలే నిరాహార దీక్షలను ప్రారంభించి నిరసన వ్యక్తం చేశారు. సత్వరమే మంత్రి తమ పదవికి రాజీనామా చేసి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాలు పంచుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ పాఠశాలల ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కొత్తబస్టాండ్ వద్ద కూర్చొని నిరసన తెలిపారు. వెలుగోడులో పొట్టి శ్రీరాములు సెంటర్‌లో సింహగర్జన సదస్సు నిర్వహించారు. బనగానపల్లెలో సమైక్యాంధ్రకు మద్దతుగా యూటీఎఫ్, ఏపీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం బస్తాలు మెస్తూ నిరసన వ్యక్తం చేశారు. ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం ఆధ్వర్యంలో రోడ్డుపై వ్యాయామం నిర్వహించారు. కొలిమిగుండ్ల మండలంలో సమైక్యాంధ్రకు మద్దతుగా రోడ్డుపై భజన చేశారు. పత్తికొండలో ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మికులు రాస్తారోకో చేపట్టారు.
 - న్యూస్‌లైన్, కర్నూలు(కలెక్టరేట్)
 
 

Advertisement
 
Advertisement
Advertisement