ఆగని మరణాలు | 28 people died sunstroke in tekkali | Sakshi
Sakshi News home page

ఆగని మరణాలు

Jun 15 2014 1:20 AM | Updated on Sep 2 2017 8:48 AM

ఆగని మరణాలు

ఆగని మరణాలు

భానుడి ప్రతాపానికి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. మూడు రోజులుగా వీస్తున్న వడగాడ్పులకు వయస్సుతో సంబంధం లేకుండా ప్రజలంతా అల్లాడిపోతున్నారు.

భానుడి ప్రతాపానికి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. మూడు రోజులుగా వీస్తున్న వడగాడ్పులకు వయస్సుతో సంబంధం లేకుండా ప్రజలంతా అల్లాడిపోతున్నారు. వడగాడ్పులు తట్టుకోలేక శనివారం ఒక్కరోజే జిల్లా వ్యాప్తంగా 28 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో వృద్ధులే అధికం
 
 టెక్కలి: నిప్పుల కొలిమికి ముసలి ప్రాణాలు గాల్లో కలసిపోతున్నాయి. వడగాడ్పులకు టెక్కలి మండలంలో శనివారం ఐదుగురు ప్రాణాలు విడిచారు. శనివారం వాతావరణం కాస్త ఉపశమనం కలిగించినప్పటికీ, గత మూడు రోజులుగా ఏర్పడిన వేడి ప్రభావానికి వీరంతా మృతి చెందారు. టెక్కలి రాజావీధికి చెందిన గాడి మల్లేశ్వరరావు(58) వడదెబ్బ తిని తన ఇంట్లోనే తుది శ్వాస విడిచాడు. ఎండ ప్రభావంతో రెండు రోజుల కిందట అస్వస్థతకు గురైన బీసీ కాలనీ వాసి సరస్వతి ప్రధానో ప్రాణాలు వదిలింది. బూరగాం పంచాయతీ పరిధి రామేశ్వరం గ్రామానికి చెందిన చల్లా సత్తెమ్మ(60) పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్తూ శుక్రవారం అస్వస్థతకు గురి కాగా కుటుంబ సభ్యులు ఆమెను స్వగ్రామం తీసుకువచ్చారు. అయితే ఆమె వచ్చిన కొద్దిసేపటికే మృతి చెందింది. బూరగాం గ్రామానికి చెందిన అంపలాపు అప్పయ్య(60), దారపు సూర్యనారాయణ(80) కూడా రెండు రోజుల నుంచి ఎండల ప్రభావానికి అస్వస్థతకు గురై శనివారం మృతి చెందారు.
 
 పలాసలో నలుగురు
 పలాస/పలాస రూరల్: పలాస లేబర్‌కాలనీలో శుక్రవారం రాత్రి తంగుడు శంకరరావు(57), పలాస మండలం కేసుపురానికి చెందిన టొంప పార్వతి(70), వీరభద్రపురానికి చెందిన తలగాపు చిన్నమ్మలు(65) శుక్రవారం అర్ధరాత్రి సమయంలో మృతి చెందారు. శుక్రవారం పగలంతా ఇంట్లోనే ఉన్న శంకరరావుకు అర్థరాత్రి 2.30 గంటలకు వాంతులయ్యా యి. ఆ తరువాత శరీరమంతా వేడిగా ఉండడంతో కుటుంబ సభ్యులు ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే పరిస్థితి విషమించింది. వేకువజామున 4 గంటలకు మృతి చెందినట్లు అతని భార్య ప్రమీల చెప్పారు.
 
 మృతునికి ముగ్గురు కుమార్తెలు కూడా ఉన్నారు. చిన్న కిరాణా వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న శంకరరావుకు ఇటీవలే మోకాళ్ల ఆపరేషన్ జరిగింది. దాని నుంచి కోలుకుంటున్న పరిస్థితుల్లోనే ఈ విధంగా మృతి చెందడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీయ్యారు. ఇదిలా ఉండగా కేసుపురానికి చెందిన టొంప పార్వతి(70) రాత్రి ఒంటిగంట సమయంలో ఉక్కపోత తట్టుకోలేక ప్రాణాలు విడిచింది. మృతురాలికి ముగ్గురు కుమారులు, ఒక్క కుమారై ఉన్నారు. వీరభద్రాపురానికి చెందిన తలగాపు చిన్నమ్మ(65) అర్ధరాత్రి నిద్రలో ఉండగా ఉక్కపోత తట్టుకోలేక ప్రాణాలు విడిచింది. ఆమెకు భర్త రామయ్య, ఐదుగురు కుమారైలు ఉన్నారు. కాగా కిలంతర మాజీ సర్పంచ్ పొట్నూరు జోగారావు తల్లి మోహనమ్మ)76) వడగాడ్పులకు మృత్యువాత పడ్డారు. ఆమెకు ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు.
 
 జి.సిగడాంలో ఇద్దరు...
 జి.సిగడాం: వడదెబ్బకి మండలంలో ఇద్దరు మృతి చెందారు. బాతువ పంచాయతీకి చెందిన పల్లేటి సూర్యనారాయణ(40), మెట్టవలసకి చెందిన ఎనుగుల అన్నపూర్ణ(50) ఉదయం 10 గంటలకు బహిర్భూమికి వెళ్లి తిరిగివస్తున్న వీరిద్దరూ వడదెబ్బ తిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ప్రాణాలు విడిచారు. అన్నపూర్ణకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సూర్యనారాయణకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంటి పెద్ద హఠాన్మరణంలో సూర్యనారాయణ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
 
 రాజాంలో నలుగురు...
 రాజాం/రాజాం రూరల్: వడదెబ్బకు రాజాం నగరపంచాయతీ, మండలం పరిధిలో నలుగురు మృతి చెందారు. నగరపంచాయతీ పరిధి కొండంపేటకి చెందిన కూరాకుల అప్పారావు(80) శనివారం మధ్యాహ్నం మృతిచెందాడు. ఆయనకు ఎవ్వరూలేకపోవడంతో మరదలి కుమారుడు సలాది చంద్రరావు వద్ద ఉంటున్నాడు. శుక్రవారం పింఛను తీసుకుని వస్తుండగా వడదెబ్బకు కుప్పకూలడంతో కుటుంబ సభ్యులు సపచర్యలు చేశారు.
 
 అయినా ఫలితంలేకుండాపోయింది. ఆయన మరణంపై వీఆర్వోకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా పొనుగుటివలస లో ఈదల కామమ్మ(65), రాజాం సామాజిక ఆస్పత్రిలో ఓ యాచకుడు(60), బొద్దాం గ్రామంలో పటానన చిన్నమ్మడు(85) అనే వృద్ధురాలు వడదెబ్బకు మృత్యువాతపడ్డారు. వడగాడ్పులు తట్టుకోలేక కామ మ్మ మూడురోజులుగా మంచంపట్టింది. శనివారం ఉదయం పరిస్థితి విషమించి మృతిచెందింది. రాజాంలో కొంతకాలంగా భిక్షాటన చేసుకుని జీవిస్తున్న వృద్ధుడు వడగాడ్పు తట్టుకోలేక రాజాం సామాజిక ఆస్పత్రిలో మృతి చెందాడు. ఆయనది రేగిడి మండలం బూరడని తెలిసి పోలీసులు అతని ఫొటో తీసుకువెళ్లి ఆరా తీశారు. బంధువులు ఎవరూ లేరని తెలియడంతో నగర పంచాయతీ సిబ్బంది ఖననం చేశారు. కాగా ఎండ తీవ్రత తట్టుకోలేక బొద్దాంలో రెండురోజులుగా మంచంపట్టిన చిన్నమ్మడు ఉదయం తుడిశ్వాస విడిచింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
 
 రేగిడిలో ఇద్దరు...
 రేగిడి: మండల పరిధి చిన్నశిర్లాం గ్రామానికి చెందిన వాస సన్యాసి(70) వడదెబ్బకు గురై శుక్రవారం అర్ధరాత్రి మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో అనారోగ్యానికి గురై మరణించారని చెప్పారు. అలాగే చిన్నయ్యపేటకు చెందిన తాడి సత్యంనాయుడు(55) కూడా వడదెబ్బకు గురై మృతి చెందాడు. నాయుడు రోడ్డు పక్కన చిత్తు పేపర్లు, ప్లాస్టిక్ కవర్లు ఏరుకుంటూ జీవనం సాగించుకొనేవాడు. ఎండ తీవ్రత తట్టుకోలేక సంకిలి బస్ షెల్టర్ వద్ద పడిపోయి మృతి చెందాడని గ్రామస్తులు తెలిపారు.
 
 సంతకవిటిలో ఇద్దరు...
 సంతకవిటి: మండలంలోని కాకరాపల్లి గ్రామానికి చె ందిన ఎన్.అమ్మాయమ్మ(78) వడగాడ్పులకు మృతిచెందింది. ఆరోగ్యంగానే తిరుగుతున్న ఆమె శుక్రవారం సాయంత్రం అస్వస్థతకు గురై సొమ్మసిల్లిపోయింది. రాత్రి నిద్రలో మరణించినట్టు ఆమె సోదరుడు ఎన్.గోవిందరావు తెలిపారు. అలాగే మందరాడ గ్రామానికి చెందిన 58 ఏళ్ల అంకం తవుడు అనే చేనేత కార్మికుడు వడదెబ్బకు గురై శనివారం మృతి చెందాడు. వారంరోజులుగా ఇంటికే పరిమితమైన ఆయన మద్యాహ్నం తుది శ్వాస విడిచాడు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు.
 
 దళ్లిపేటకు చెందిన
 వృద్ధురాలు...
 
 పొందూరు: వడదెబ్బకు మండలంలోని దళ్లిపేటకు చెందిన నీలాపు దుర్గమ్మ(65) మృతి చెందింది. ఎండ తీవ్రతకు తట్టుకోలేక ఉదయం 11 గంటలకు తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రాణాలు విడిచింది.
 
 అంబుగాంలో వృద్ధుడు...
 మందస: అంబుగాం గ్రామానికి చెందిన ముంజేటి హరికృష్ణ(59) వడదెబ్బకు గురై ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇంట్లోనే ఉన్న హరికృష్ణ వడగాడ్పులు తట్టుకోలేక పెద్దగా కేకలు వేస్తూ సొమ్మసిల్లిపోయాడు. ఆ సమయంలో కుటుంబ సభ్యులు పనుల మీద బైటకు వెళ్లారు. పొరుగునే ఉంటున్న వారు వచ్చి ఆయనను ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ అక్కడే మృతి చెందాడు. ఆయన భార్య అప్పలమ్మ ఈ విషయాన్ని వీఆర్‌వోకు తెలియజేసింది.
 
 బొరివంకలో మహిళ...
 కవిటి: మండలంలోని బొరివంకకు చెందిన శకుంత ల రౌళో(55) వడదెబ్బతో తీవ్ర అస్వస్థతకు గురై శుక్రవారం అర్ధరాత్రి మృతిచెందింది. కూలీనాలీ చేసుకుంటూ బతుకు వెళ్లదీస్తున్న శకుంతల భర్త గతంలో చనిపోగా కుమారుడు ఆమెను విడిచిపెట్టి వెళ్లడంతో కుమార్తె సరస్వతి రౌళో వద్ద ఉంటోంది. పేదరికంతో బతుకు లాగుకొస్తున్న ఆమె శుక్రవారం కట్టెలు తెచ్చుకునేందుకు తోటల్లోకి వెళ్లింది. ఎండ వేడిమి తట్టుకోలేక నీరసించి పడుకొంది. రాత్రి భోజనానికి కుమార్తె సరస్వతి పిలిచింది. ఎంత పిలిచినా లేవకపోవడంతో ఆర్‌ఎంపీ వైద్యుడిని తీసుకొచ్చి చికిత్స చేయించినా ఫలితంలేకుండాపోయింది.
 
 మడపాలలో వృద్ధుడు...
 నరసన్నపేట రూరల్: వడదెబ్బకు గురై మండలంలోని మడపాంలో కొటివాడ బారికివాడు(65) శనివారం వేకువజామున మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఆరోగ్యంగా ఉన్న ఆయన శుక్రవారం వ్యవసాయ పనులకు వెళ్లి వడదెబ్బకు గురైనాడు. వెంటనే కుటంబ సభ్యులు వైద్యం చేయించారు. చికిత్స పొందుతూ బారికివాడు మృతిచెందారు.
 
 తుమరాడలో ఒకరు...
 పాలకొండ రూరల్: మండలంలోని తుమరాడకు చెందిన మొయ్యి పాపయ్య(60) వడగాడ్పులు తట్టుకోలేక మృత్యువాతపడ్డాడు. మూడు రోజులుగా వీస్తున్న వడగాలులను తట్టుకోలేక ఇబ్బందిపడుతూ వచ్చిన ఆయన ప్రాణాలు విడిచాడని గ్రామస్తులు పేర్కొన్నారు. ఆయన భార్య చిట్టెమ్మ, పిల్లలు కూడా ఉన్నారు. ఇంటిపెద్ద అకస్మాత్తుగా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.
 
 కిన్నెరవాడలో వృద్ధురాలు...
 సారవకోట రూరల్: మండలంలోని కిన్నెర వాడ గ్రామానికి చెందిన రేగులపాడు బోడెమ్మ(70) శనివారం వడదెబ్బతో మృతి చెందింది. జలుమూరు మండలం లింగాలపాడుకు చెందిన బోడెమ్మకు కుమారులు లేకపోవడంతో కొన్ని నెలలుగా కుమార్తె గౌరమ్మ ఇంట్లో ఉంటోంది. మూడు రోజులుగా వీస్తున్న వడగాడ్పులు తట్టుకోలేక అనారోగ్యానికి గురైన ఆమె మృతి చెందింది. విషయం తెలిసి రెవెన్యూ సిబ్బంది గ్రామానికి చేరి వివరాలు సేకరించారు. పోస్టుమార్టం చేయాలని అధికారులు భావించగా గౌరమ్మ అంగీకరించలేదు. దీంతో సహజ మరణంగా అధికారులు గుర్తించినట్లు తహశీల్దార్ నరసయ్య తెలిపారు.
 
 కరజాడలో వృద్ధుడు...
 శ్రీకాకుళం రూరల్: వడదెబ్బకు మండలంలోని కరజాడ గ్రామానికి చెందిన కొమనాపల్లి అప్పలసూరి(80) మృతి చెందారు. ఇంటి వద్ద గాలి లేక ఇబ్బంది పడిన ఆయన జాతీయ రహదారి పక్కన ఉన్న బస్సు షెల్టర్‌కు వచ్చాడు. అక్కడ వడగాల్పులను తట్టుకోలేక మృత్యువాత పడ్డాడు.
 
 అరకభద్రలో ఒకరు...
 ఇచ్ఛాపురం రూరల్: మండలంలోని అరకభద్రలో వడదెబ్బకి బింగి టొంపయ్య(65) అనే వృద్ధుడు మృతి చెందాడు. వడగాడ్పులకు శుక్రవారం రాత్రి అస్వస్థతకు గురైన టొంపయ్యకు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం తీసుకువెళుతుండగా మృతి చెందాడు.
 
 మెట్టక్కివలసలో ఒకరు...
 ఆమదాలవలస: మున్సిపాల్టీ పిరధి మెట్టక్కివలస గాంధీనగర్‌కు చెందిన కుంచు లచ్చన్న(55) వడగాడ్పులు తట్టుకోలేక శనివారం మృతిచెందాడు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. రోజు కూలీ చేసి కుటుంభాన్ని పోషస్తున్న లచ్చన్న హఠాత్తుగా మృతి చెందడంతో ఆ కుటుంబం రోడ్డున పడినట్లయింది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement