21న తారల క్రికెట్ | 21 stars Cricket | Sakshi
Sakshi News home page

21న తారల క్రికెట్

Dec 1 2013 2:49 AM | Updated on Jul 7 2018 3:42 PM

వైఎస్ రాజశేఖర్‌రెడ్డి స్టేడియం మరో సంబరానికి వేదికవుతోంది. నిన్న ఇండియా- వెస్టిండీస్ క్రికెట్ జట్ల పోరును కనులారా వీక్షించిన విశాఖ వాసులను ఈ సారి తారల క్రికెట్ అలరించనుంది.

వైఎస్ రాజశేఖర్‌రెడ్డి స్టేడియం మరో సంబరానికి వేదికవుతోంది. నిన్న ఇండియా- వెస్టిండీస్ క్రికెట్ జట్ల పోరును కనులారా వీక్షించిన విశాఖ వాసులను ఈ సారి తారల క్రికెట్ అలరించనుంది. ఇందుకు ఈ నెల 21వ తేదీ  ముహూర్తం ఖరారైంది. గతంలో సీసీఎల్ పేరిట పోటీలు జరిగితే, ఈసారి టాలీవుడ్ జట్టుతో బాలీవుడ్ జట్టు తలపడనుంది.
 
 శ్రీకాంత్... సునీల్‌శెట్టి నాయకత్వం
 టీఎస్‌ఆర్ సీసీ కప్ పేరిట నిర్వహించనున్న ఈ పోటీలో టాలీవుడ్ జట్టుకు శ్రీకాంత్, బాలీవుడ్ జట్టుకు సునీల్ శెట్టి నాయకత్వం వహించనున్నారు. మోహన్‌బాబు, జయప్రద, బ్రహ్మానందం, బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల, చార్మి, మంచు లక్ష్మి, స్నేహా ఉల్లాల్, రాణాలు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరుకానున్నారు.
 
 మధ్యాహ్నం మ్యాచ్
 ఈ నెల 21న తొలి బంతి మధ్యాహ్నం  మూడుగంటలకు పడనుంది. అంతా సవ్యంగా జరిగితే మ్యాచ్ ఫ్లడ్‌లైట్ల కాంతి నడుమ  పది గంటలకల్లా పూర్తికానుంది. తారల తళుకులతో స్టేడియంలో జరిగే హల్‌చల్‌కు అనుకున్న టైమ్‌కే మ్యాచ్ నిర్వహణ కాస్తకష్టమైన పనే. రూ. 2కోట్లు టీఎస్‌ఆర్ యూత్‌వింగ్ ఖర్చుపెట్టి నిర్వహిస్తోంది.
 
 టాలీవుడ్ జట్టు
 శ్రీకాంత్, అల్లరినరేష్, నాని, ప్రిన్స్, ఆదర్స్, రాజీవ్, రఘు, ప్రభు, అయ్యప్ప, ఖయ్యం, నిఖిల్ టాలీవుడ్ జట్టులో ఆడనునాన్నారు.
 
 బాలీవుడ్ జట్టు
 సునీల్ శెట్టి, రితీష్, సోనుసూద్, రణ్‌దీప్, మహేష్ మంజ్రేకర్, మకరంద్, సన్నీ, మనోజ్, షబ్బీర్, రాజాలు బాలీవుడ్ జట్టులో ఆడనున్నారు.
 
 అంతా ఉచితమే

 గతంలో జరిగిన తారల క్రికెట్‌కు భిన్నంగా ఈ మ్యాచ్‌ను నిర్వహించనున్నారు. నగరంలోనే యాభైవేల మంది వరకు విద్యార్థులున్నారని, వారందరినీ ఆహ్లాద పరిచేందుకే ఈ మ్యాచ్ అంటూ నిర్వాహకులు పేర్కొంటున్నారు. టికెట్ల అమ్మకాలు ఉండవని, అంతా కాంప్లిమెంటరీలే అంటున్నారు.
 
 పోస్టర్, టికెట్లు విడుదల

 స్థానికంగా శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి, మంత్రి గంటా శ్రీనివాసరావు తదితరులు తారల క్రికెట్ మ్యాచ్ వివరాలు వెల్లడించారు. అనంతరం కాంప్లిమెంటరీ టికెట్లను, తారల క్రికెట్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మ్యాచ్ నిర్వాహక కమిటీ ప్రతినిధులు రెహ్మాన్, తిప్పల గురుమూర్తి, ప్రభుకిషోర్, వరదారెడ్డి పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement