పదో తరగతి తెలుగు పశ్నాపత్రం లీక్? | 10th class Telugu Paper leaked? | Sakshi
Sakshi News home page

పదో తరగతి తెలుగు పశ్నాపత్రం లీక్?

Mar 21 2016 7:31 PM | Updated on Sep 3 2017 8:16 PM

కూనవరంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ పరీక్ష కేంద్రం-ఎలో సోమవారం పదవ తరగతి తెలుగు పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం లీక్ అయింది.

కూనవరం (తూర్పు గోదావరి జిల్లా) : కూనవరంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ పరీక్ష కేంద్రం-ఎలో సోమవారం పదవ తరగతి తెలుగు పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం లీక్ అయింది. ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా ప్రశ్నాపత్రం 10.23 గంటలకు వాట్సప్ లో హల్‌చల్ చేసింది. ప్రశ్నలు తెలిసిపోవడంతో పరీక్షా కేంద్రం బయట ఉన్న కొందరు సంబంధించిన జవాబులను పుస్తకాల నుంచి సేకరించబోయారు. ఇంతలో విలేకరులు అక్కడకు చేరుకోగా కంగారుగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ హడావుడిలో ఓ వ్యక్తి వదిలి వెళ్లిన సెల్‌ఫోన్‌ను పరిశీలించగా ప్రశ్నాప్రత్రం వాట్సప్ ద్వారా వెల్లడైన వైనం బయటపడింది.

ఈ విషయం చానళ్లలో ప్రసారం కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఏజెన్సీ ఇన్‌చార్జి డీఈఓ టీవీఎస్‌జీ కుమార్ మధ్యాహ్నం 3 గంటల అనంతరం పరీక్షా కేంద్రాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ అందుబాటులో లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. ప్రశ్నాపత్రం లీకవడంపై డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్ బాబూరావు, సిట్టింగ్ స్క్వాడ్ సీతారాములు, ఇన్విజిలేటర్లను విచారించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రశ్నాపత్రం వాట్సప్ ద్వారా వెల్లడైన విషయమై సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తున్నామని, నివేదికను కలెక్టర్‌కు అందచేస్తామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement