రేపు జీఎస్‌ఎల్‌వీ మార్క్‌–3డీ2 ప్రయోగం

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) లోని రెండో ప్రయోగ వేదిక నుంచి బుధవారం సాయంత్రం 5.08 గంటలకు జీఎస్‌ఎల్‌వీ మార్క్‌ 3డీ2 ఉపగ్రహవాహక నౌకను ప్రయోగించనున్నారు. 25.30 గంటల ముందు అంటే.. మంగళవారం సాయంత్రం 3.38 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభించేందుకు సోమవారం ప్రయోగ సమయాన్ని ఎంఆర్‌ఆర్‌ కమిటీ అధికారికంగా ప్రకటించింది. షార్‌లోని బ్రహ్మ ప్రకాష్‌ హాల్లో సోమవారం ఎంఆర్‌ఆర్‌ చైర్మన్‌ బీఎన్‌ సురేష్, కాటూరి నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంఆర్‌ఆర్‌ కమిటీ భేటీ ఈ నిర్ణయం తీసుకున్నారు. రాకెట్‌లోని అన్ని దశలకు తుది విడత పరీక్షలు నిర్వహించి ప్రయోగ పనులను లాంచ్‌ ఆ«థరైజేషన్‌ బోర్డుకు అప్పగించారు. బోర్డు చైర్మన్‌ పాండ్యన్‌ ఆధ్వర్యంలో రిహార్సల్స్‌ నిర్వహించి కౌంట్‌డౌన్‌ కు ఏర్పాట్లు చేస్తున్నారు. జీఎస్‌ఎల్‌వీ మార్క్‌ 3డీ2 రాకెట్‌లో రెండో దశలోనే ద్రవ ఇంధనాన్ని నింపాల్సి ఉండడంతో కౌంట్‌డౌన్‌ సమయాన్ని 25:30 గంటలు గానే నిర్ణయించారు. ఇస్రో చరిత్రలో అతిపెద్ద ప్రయో గం కావడంతో శాస్త్రవేత్తలు జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారు. మూడున్నర టన్నులపైగా బరువున్న ఉపగ్రహాన్ని షార్‌ నుంచి ప్రయోగించడం ఇదే తొలిసారి.  
 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top