ఆదివారం వారాంతపు సెలవు నోట్ల వేటలో కరిగిపోయింది. నోటు దొరకలేదు. శ్రమ మాత్రం వృథా అయింది. మూడు రోజులు వరుస సెలవులతో బ్యాంకులు మూత పడ్డాయి. అత్యవసర ఖర్చుల కోసం కనీసం రూ.2 వేలైనా తీసుకుందామని ఏటీఎంలను వెతుక్కుంటూ వెళితే ఎక్కడకు వెళ్లినా ‘నో క్యాష్... అవుటాఫ్ ఆర్డర్’ బోర్డులే దర్శనమిచ్చాయి. ఆదివారం రాష్ట్రంలో 90 శాతంపైగా ఏటీఎంలు పనిచేయలేదు.గుంటూరు నగరంలో వంద ఏటీఎంలు ఉండగా నగరపాలెంలో ఒక్క ఏటీఎం మాత్రమే పని చేసింది. జిల్లాలో మొత్తం 800 ఏటీఎంలు ఉండగా పట్టుమని పది కూడా పనిచేయలేదు. కర్నూలు జిల్లాలో 95 శాతంపైగా ఏటీఎంలు మూతపడ్డాయి. ఉద్యోగులు శని, ఆదివారాల్లో సెలవులు కావడంతో నగదు తీసుకునేందుకు ఏటీఎంల చుట్టూ తిరుగుతూ వారాంతపు సెలవులను వృథా చేసుకున్నామని వాపోయారు.