నల్లధనం దాచుకునేందుకు బ్యాంకు ఖాతాల్ని దుర్వినియోగం చేస్తే వారిపై చర్యలు తప్పవని కేంద్రం శుక్రవారం హెచ్చరించింది. జన్ధన్ ఖాతాదారులు, గృహిణులు, ఇతరులు తమ ఖాతాల్ని నల్లధనం డిపాజిట్లకు అనుమతిస్తే ఐటీ చట్టం కింద విచారిస్తామని ప్రకటించింది. ఇతరుల బ్యాంకు ఖాతాల్ని వాడుకుని కొందరు నల్లధనం మార్చుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అందుకు ప్రతిగా కొందరికి డబ్బు ఎరచూపుతున్నట్లు తెలిసిందని పేర్కొంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం సాధారణ ఖాతాల్లో రూ. 2.50 లక్షల వరకూ, జన్ధన్ ఖాతాల్లో రూ. 50 వేల వరకూ జమ చేసుకోవచ్చు. ‘ఇతరుల నల్లధనం మీ ఖాతాలో జమ చేసుకునేందుకు అనుమతిస్తే... విచారణలో అది నిజమని రుజువైతే ఆ నగదుపై ఆదాయపు పన్నుతో పాటు పెనాల్టీ విధిస్తాం. ఖాతాను దుర్వినియోగం చేసేందుకు అనుమతించిన వ్యక్తిని ఆదాయపు పన్ను చట్టం కింద విచారిస్తాం’ అని ఆర్థిక శాఖ పేర్కొంది. నల్లధనం బ్యాంకులో డిపాజిట్ చేస్తే పన్ను, వడ్డీతో పాటు 200 శాతం పెనాల్టీ విధించనున్నారు. బ్యాంకు లాకర్లు సీజ్ చేసి బంగారం, వజ్రాలు, ఆభరణాలు స్వాధీనం చేసుకుంటారన్న వార్తల్లో నిజం లేదని, అవి వదంతులేనని పునరుద్ఘాటించింది.
Nov 19 2016 7:01 AM | Updated on Mar 20 2024 5:03 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement