● లోకేష్ ఉత్తర కుమార ప్రగల్భాలు మానుకో
● రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారుస్తున్న కూటమి ప్రభుత్వం
● ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి
పులివెందుల : ‘క్రెడిట్ చోరీ’కి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు అని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి విమర్శించారు. పులివెందుల భాకరాపురంలో ఉన్న తన స్వగృహం వద్ద ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు, ఎల్లో మీడియాలు గత వారం రోజుల నుంచి క్రెడిట్ చోరీకి తీవ్ర ప్రయత్నాలు చేశారన్నారు. అందులో భాగంగా వాస్తవాలను కప్పిపుచ్చి అవాస్తవాలను వండి వార్పించడం జరిగిందన్నారు. వారు ఎన్ని అవాస్తవాలను తెరపైకి తెచ్చినా వాస్తవాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వెలిగొండ ప్రాజెక్టు పనులు జగనన్న పరుగుల పెట్టించాడన్నది వాస్తవమన్నారు. వెలిగొండ ప్రాజెక్టుకు కీలకమైన జంట సొరంగాలు 37.587కిలోమీటర్లు పూర్తి చేసింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే అన్నారు. దివంగత వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో వెలిగొండ ప్రాజెక్టుకు ప్రాణం పోసి సమగ్రమైన రూపం ఇవ్వడం జరిగిందన్నారు. ఆ తర్వాత చంద్రబాబు 2014–19 కాలంలో ఒక్క సొరంగానికి కూడా బ్రేక్ త్రూ సాధించలేకపోయాడన్నారు. చంద్రబాబు హయంలో వెలిగొండ సొరంగాల తవ్వకాలు పనులు జరిగింది 6.685కి.మీ మాత్రమేనన్నారు. దివంగత వైఎస్సార్, వైఎస్ జగన్ హయాంలో 30.901కి.మీ సొరంగాల తవ్వకాల పనులు జరిగాయన్నారు. మరి ఎవరి హయాంలో వెలిగొండ ప్రాజెక్టు రూపుదిద్దుకుందో ప్రజలు గమనించాలన్నారు. చంద్రబాబు ఎన్ని జిమ్మిక్కులు చేసినా వాస్తవాలు ఎప్పటికీ అవాస్తవాలు కాలేవన్నారు.
లోకేష్ ఉత్తర కుమార ప్రగల్భాలు మానుకో.. :
విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ మాటలు చూస్తుంటే ఉత్తర కుమార ప్రగల్భాలు పలికినట్లుగా ఉందని ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి విమర్శించారు. డీఎస్సీలో అవకతవకలు జరిగాయని సాక్ష్యాలతో సహా బహిర్గతమైందన్నారు. అయినా తప్పును కప్పి పుచ్చుకునేందుకు నారా లోకేష్ వైఎస్ జగనన్నపై లేనిపోని విమర్శలు, అర్థంలేని సవాళ్లు విసురుతున్నాడన్నారు. లోకేష్తో చర్చకు జగనన్న అవసరంలేదని డీఎస్సీలో అన్యాయం జరిగిన అభ్యర్థులు సరిపోతారన్నారు. డీఎస్సీలో అక్రమాలు జరగనప్పుడు శాసన మండలిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు చర్చకు పట్టుబడితే.. చర్చించకుండా ఎందుకు తప్పించుకున్నారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాన్ని తమ స్వార్థం కోసం రాజధాని పేరుతో అప్పుల ఆంధ్రప్రదేశ్గా మారుస్తున్నారన్నారు. అనంతరం ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు.


