24 మంది విద్యార్థులు డిబార్‌ | - | Sakshi
Sakshi News home page

24 మంది విద్యార్థులు డిబార్‌

May 13 2026 1:32 AM | Updated on May 13 2026 1:32 AM

24 మంది విద్యార్థులు డిబార్‌ గోడౌన్‌లోని ఇనుపకడ్డీలు మాయం జిల్లాలో 316 ఆలయాలకు ధూపదీప నైవేద్య పథకం పీహెచ్‌సీ తనిఖీ 15న వైఎస్సార్‌ సీపీ ఎస్సీ సెల్‌ విస్తృత స్థాయి సమావేశం

కడప ఎడ్యుకేషన్‌: యోగి వేమన విశ్వవిద్యాలయం పరిధిలోని అనుబంధ కళాశాలల డిగ్రీ పరీక్షల్లో 24 మంది విద్యార్థులు డిబార్‌ అయ్యారు. మంగళవారం అన్నమయ్య జిల్లాలోని పలు పరీక్షా కేంద్రాలను విశ్వవిద్యాలయ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ప్రొఫెసర్‌ కెఎస్వీ కృష్ణారావు, అడిషనల్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ డా.సుభోష్‌ చంద్ర విస్తృతంగా తనిఖీ చేశారు. గాలివీడు ఆర్‌.ఆర్‌.జి.ఆర్‌ డిగ్రీ కాలేజీలో 20 మంది, రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నలుగురు విద్యార్థులు కాపీలు రాస్తుండగా గుర్తించి డిబార్‌ చేశారు. చిన్న మండెం ప్రియదర్శిని డిగ్రీ కళాశాల కేంద్రాన్ని తనిఖీ చేశామన్నారు.

ప్రొద్దుటూరు: స్థానిక వ్యవసాయ మార్కెట్‌ యార్డులోని గోడౌన్‌లో నిల్వ ఉన్న రూ.కోటి 71 లక్షల విలువైన ఇనుపకడ్డీలు మాయమైనట్లు హౌసింగ్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు గుర్తించారు. పేదల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి గోడౌన్‌లో 270 టన్నుల ఇనుప కడ్డీలను నిల్వ ఉంచగా ప్రస్తుతం 2.3 టన్నులు మాత్రమే ఉన్నాయి. ఈ ప్రకారం రూ.1.71 కోట్ల విలువైన 268.56 టన్నుల ఇనుప కడ్డీలు మాయమైనట్లు అధికారులు గుర్తించారు. మంగళవారం హౌసింగ్‌ డిపార్ట్‌మెంట్‌ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్‌ వి.రాజారత్నంతోపాటు ప్రొద్దుటూరు ఇన్‌చార్జి ఈఈ రాజశేఖర్‌, రాజంపేట ఈఈ ఎం.మురళి గోడౌన్‌ను పరిశీలించారు.

వాల్మీకిపురం: అన్నమయ్య జిల్లాలోని ఎండోమెంట్‌ పరిధిలో ఉన్న 316 ఆలయాలకు ధూపదీప నైవేద్య పథకంను వర్తింపజేస్తున్నట్లు ఎండోమెంట్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ విశ్వనాథ్‌ తెలిపారు. మంగళవారం స్థానిక నిమ్మనపల్లి రోడ్డు లోని శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ఆలయాలను పరిరక్షిస్తూ నిత్య పూజలు, కైంకర్యాల కోసం నిధులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఆలయాల్లో అర్చకులు నిర్లక్ష్యం వహిస్తే నిధులను రద్దు చేస్తామన్నారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. అర్చకులు, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

రామసముద్రం: రామసముద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్‌వో లక్ష్మీ నరసయ్య మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. అనంతరం రక్త పరీక్షల గది, ఫార్మసీ, వాక్సిన్‌ రూమ్‌, లేబర్‌ రూమ్‌, వార్డులను పరిశీలించారు. రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలు సక్రమంగా అందుతున్నాయా లేదా అనేసి అక్కడున్న రోగులు, ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో పరిశుభ్రత, సేవల నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశించారు.

సాక్షి, మదనపల్లె: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ విభాగం జిల్లా విస్తత స్థాయి సమావేశం ఈనెల 15న నిర్వహించనున్నట్లు ఆ విభాగం రాష్ట్ర కార్యదర్శి కేవీ.రమణ మంగళవారం తెలిపారు. స్థానిక బైపాస్‌ రోడ్డులోని జీనత్‌ కళ్యాణ మండపంలో జరిగే ఈ సమావేశానికి ఎస్సీ విభాగం జిల్లా కమిటీ, ఎస్సీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, పార్టీకి చెందిన వివిధ భాగాలకు చెందిన ఎస్సీ నాయకులు, నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి ఎస్సీ విభాగాల కమిటీలు, నాయకులు హాజరుకావాలని కోరారు. సమావేశానికి రీజనల్‌ కో–ఆర్డినేటర్‌, మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గడి కోట శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు హాజరవుతున్నట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement