కలెక్టర్ శ్రీధర్
కడప సెవెన్రోడ్స్: రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతికతలు, ఉద్యానవన పంటలలో నూతన ఆవిష్కరణలు, మార్కెట్ అవకాశాలను ఒకే వేదికపై పరిచయం చేసే ‘రైతు పండుగ – అగ్రి ఇన్నోవేషన్ అండ్ హార్టికల్చర్ ఎక్స్పో 2026’ను విజయవంతం చేయాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం కలెక్టరేట్లో ఈనెల 22–24వ తేదీ వరకు కడపలో నిర్వహించనున్న ‘రైతు పండుగ – అగ్రి ఇన్నోవేషన్ అండ్ హార్టికల్చర్ ఎక్స్పో 2026’ నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మే 22 నుంచి 24 వరకు మూడు రోజులపాటు కడపలోని మేడా కన్వెన్షన్ సెంటర్లో ఈ మహోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. రైతులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ నిపుణులు, స్టార్టప్ సంస్థలు, వ్యాపార వేత్తలు పాల్గొనే ఈ కార్యక్రమం రాష్ట్రంలోనే అతిపెద్ద అగ్రి – హార్టికల్చర్ ఎక్స్పోగా నిలుస్తుందని పేర్కొన్నారు. రైతులకు వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం చేరువ చేయడమే లక్ష్యంగా ఈ ఎక్స్పో నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు.
స్మార్ట్ కిచెన్ షెడ్ల నిర్మాణ పనుల్లో
వేగం పెంచాలి: జిల్లాలోని అన్ని మండలాల్లో ఏర్పాటవుతున్న సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ షెడ్స్ నిర్మాణ పనులను జూన్ 1వ తేదీలోపు పూర్తి చేసి పాఠశాలల పునఃప్రారంభంలోపు నిర్వహణలోకి తీసుకురావాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో కలెక్టర్, జేసీ డాక్టర్ నిధి మీనా, కేఎంసీ కమిషనర్ హెచ్ఎస్ భావనతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత శుచిగా, రుచికరంగా అందించేందుకు వినూత్నంగా అమలు చేస్తున్న సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ వ్యవస్థ జాతీయ స్థాయిలో అత్యుత్తమ పురస్కారంతో పాటు, ఇతర రాష్ట్రాలకు కూడా స్ఫూర్తినిస్తోందన్నారు. ఈ నెల 28 లోపు అన్ని రకాల నిర్మాణ పనులను పూర్తి చేసి.. రెండు రోజులు ట్రయల్ రన్ కూడా నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలోసీపీఓ హజరతయ్య, స్మార్ట్ కిచెన్ల పర్యవేక్షకులు జోయల్ విజయకుమార్, డీఆర్డీఏ పీడీ రాజ్యలక్ష్మి, పీఆర్ ఎస్ఈ మద్దన్న, డిఎవో శంశుద్దీన్, నేచురల్ ఫార్మింగ్ జిల్లా మేనేజర్ ప్రవీణ్ కుమార్, హౌసింగ్ పీడి రాజరత్నం, ఏపీఎస్పీడిసిఎల్ ఎస్ఈ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
నూతన ఆవిష్కరణలతో కడప స్ఫూర్తి
పరిశ్రమలు, మౌలిక వసతులు, రోడ్లు, ఐటీ, టూరిజం, ఎడ్యుకేషన్, పెట్టుబడులు వంటి అంశాలతో పాటు వినూత్న ఆవిష్కరణలతో వైఎస్ఆర్ కడప జిల్లా రాష్ట్రానికి స్ఫూర్తినిస్తోందని రాష్ట్ర పరిశ్రమలు – వాణిజ్యం (గనులు) కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. స్వర్ణ ఆంధ్ర– 2047 విజన్కు అనుగుణంగా వైఎస్సార్ కడప జిల్లాను అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నామని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి రాష్ట్ర ప్రత్యేక ముఖ్య కార్యదర్శికి వివరించారు. మంగళవారం మధ్యాహ్నం కలెక్టరేట్ లోని బోర్డు మీటింగ్ హాలులో జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అంతకుముందు కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి జిల్లాలో జరుగుతున్న ప్రత్యేక ప్రాజెక్టులు, పెట్టుబడులు, పారిశ్రామిక వృద్ధి, మౌలిక వసతుల అభివద్ధి, వ్యవసాయ పురోగతి తదితర అంశాలపై సమగ్ర పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను రాష్ట్ర కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనాకు సమర్పించారు.


