మైదుకూరు : బతుకు దెరువు కోసం డ్రిల్లింగ్ పని చేస్తూ విద్యాదాఘాతానికి గురై ఓ యువకుడు మృతి చెందిన సంఘటన మైదుకూరులో మంగళవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక నంద్యాల రోడ్డులోని ఎంపీపీ మెయిన్ స్కూల్ సమీపంలో మంగళవారం ఉదయం దెబ్బతిన్న ఓ ఇంటి మెట్లను తొలగించేందుకు డ్రిల్లింగ్ చేస్తూ కై పు రాజేష్ అలియాస్ ఘని (37) అనే యువకుడు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. డ్రిల్లర్కు ఉన్న వైర్లు షార్టేజ్ కావడంతో రాజేష్ విద్యుదాఘాతానికి గురైనట్టు తెలుస్తోంది. ఇంటి యజమాని, మరికొందరు అతన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించగా మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. పట్టణంలో గాంధీనగర్కు చెందిన రాజేష్కు జోసెఫ్ పేటకు చెందిన కవితతో 15 ఏళ్ల కిందట వివాహం అయింది. వీరికి ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు. రాజేష్ మృతి గురించి తెలియగానే అతని భార్య కవిత, తల్లిదండ్రులు మైఖేల్, సంతోషమ్మ ఆస్పత్రి వద్దకు చేరుకొని బోరున విలపించారు. మైదుకూరు పోలీసులు సంఘటనపై కేసు నమోదు చేసుకుని రాజేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.


