చాపాడు : చాపాడులోని పాత అల్లాడుపల్లె రైతు సేవా సహకార సంఘం బ్యాంక్ ఆవరణలో మంగళవారం మద్యం అధికంగా తాగి వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కుచ్చుపాప గ్రామానికి చెందిన సంబటూరు నాగసుబ్బయ్య(40) ఇంటి నుంచి ఉదయాన్నే చాపాడుకు వచ్చి సొసైటీ బ్యాంక్ వద్ద అధికంగా మద్యం తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. మద్యం మత్తులో కిందపడి ఎంతసేపటికీ లేవకపోవడంతో సమీపంలోని హోటల్లో ఉన్న మహిళలు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వద్ద ఆధారాలను వెతికి చూడగా జేబులో ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా కుచ్చుపాప గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించి కుటుంబీకులకు సమాచారం అందించారు. నాగసుబ్బయ్య మద్యానికి బానిస అయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య అనసూయ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు.


