కడప అర్బన్ : వైద్యరంగంలో నర్సుల సేవలు ప్రశంసనీయమని సూపరింటెండెంట్ డాక్టర్ వెంకట రాముడు తెలిపారు. కడప నగర శివారులోని రిమ్స్ ఆవరణలో ప్రభుత్వ మానసిక వైద్యశాల(ఐఎంహెచ్)లో మంగళవారం నర్సుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్లోరెన్స్ నైటింగేల్ సేవలను స్మరించుకుంటూ ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం సూపరింటెండెంట్ మాట్లాడుతూ రిమ్స్ ఆవరణలో ప్రభుత్వ మానసిక వైద్యశాల స్థాపించి రెండేళ్లు అయిందని, అప్పటి నుంచి ఈ వైద్యశాలలో డాక్టర్లు, నర్సులు ఇతర సిబ్బంది బాగా పని చేసి వైద్యశాలకు రాష్ట్రంలోనే మొదటి స్థానాన్ని నిలబెట్టారని తెలిపారు. ఇదే విధంగా వైద్య సేవలు స్ఫూర్తిదాయకంగా కొనసాగించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హెడ్ నర్సులు, ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఏవో, డైటీషియన్ పాల్గొన్నారు.


