కడప వైఎస్ఆర్ సర్కిల్: నగరంలోని వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 14న అండర్ 14 16, బాలుర క్రికెట్ ఎంపికలు నిర్వహించనున్నట్లు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ వైయస్సార్ డిస్టిక్ కార్యదర్శి ఏ. రెడ్డి ప్రసాద్ తెలిపారు . ఈ ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు ఆధార్ కాపీ,బర్త్ సర్టిఫికెట్(ఫారం 5), లాస్ట్ 3 సంవత్సరాల మార్కులిస్ట్, పాస్ పోర్ట్ సైజ్ ఫొటోతో పాటు తమ కిట్ బ్యాగులు కూడా తీసుకురావాలని పేర్కొన్నారు. అండర్– 16 ఎంపికలకు 2010 సెప్టెంబర్ 1 తర్వాత జన్మించిన వారు అర్హులన్నారు. అండర్ –14కి 2012 సెప్టెంబర్ 1 తర్వాత జన్మించిన వారు అర్హులని వివరించారు.
ప్రొద్దుటూరు కల్చరల్: భారత తపాలా శాఖ ఆధ్వర్యంలో పోస్టల్ లైఫ్ ఇన్స్యూరెన్స్, రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్రచారార్థం జయహో బీమా సంకల్ప్ మెగా మేళాను ఈనెల 20 నుంచి 22 వరకు నిర్వహించనున్నట్లు ప్రొద్దుటూరు డివిజన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ జి.కిరణ్ సోమవారం తెలిపారు. ప్రొద్దుటూరు డివిజన్ పరిధిలోని అన్ని పోస్టాఫీసులలో జయ హో బీమా సంకల్ప్ నిర్వహించనున్నట్లు ఆయ న పేర్కొన్నారు. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ తక్కువ ప్రీమియంతో అధిక బోనస్ రేట్లు అందిస్తూ, ఇతర బీమా సంస్థలతో పోలిస్తే ప్రజ లకు మరింత ప్రయోజనకరంగా ఉంటుందని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రతి గ్రామస్తుడు తమ సమీపంలోని పోస్టా ఫీసు ద్వారా రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్స్యూరెన్స్ పథకంలో చేరవచ్చని పేర్కొన్నారు.
కడప రూరల్: వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయం పరిధిలో సోమవారం రాయలసీమ జిల్లాల వ్యాప్తంగా స్టాఫ్ నర్స్ నుంచి హెడ్ నర్స్గా పదోన్నతుల కౌన్సెలింగ్ నిర్వహించారు. మొత్తం 24 మందికి గాను 21 మంది పదోన్నతులు పొందారు. ఈ సందర్భంగా ఆ శాఖ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ రామగిడ్డయ్య మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలు, నిబంధనల ప్రకారం ప్రమోషన్లు కల్పించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ నాగరత్నమ్మ, సూపరిండెంట్ శ్రీనివాసులు, సీనియర్ అసిస్టెంట్ వనిష తదితరులు పాల్గొన్నారు.
కడప కోటిరెడ్డిసర్కిల్: గతంలో ఓకా–మధురై–ఓకా మధ్య స్పెషల్ రైలు నడిచేదని, దాని స్థానంలో ఓకా–తిరుపతి (19560), తిరుపతి–ఓకా (19559) వీక్లీ రెగ్యులర్ రైలుగా నడుపుతున్నారని కడప రైల్వే కమర్షియల్ ఇన్స్పెక్టర్ జనార్దన్ తెలిపారు. ప్రతి సోమవారం ఓకాలో రాత్రి 11.35 గంటలకు బయలుదేరి ద్వారక, కంబాలియా, జామ్నగర్, రాజ్కోట్, సురేంద్రానగర్, అహ్మదాబాద్, వడోదర, సూరత్, అకోల, నాందేడ్, నిజామాబాద్, కరీంనగర్, కాచిగూడ, మహబూబ్నగర్, కర్నూలు, డోన్, తాడిపత్రి మీదుగా కడపకు మరుసటిరోజు సాయంత్రం 5.55 గంటలకు చేరుకుని, అక్కడి నుంచి రాజంపేట, రేణిగుంట మీదుగా తిరుపతికి రాత్రి 11.30 గంటలకు చేరుతుందన్నారు. ప్రతి గురువారం తిరుపతిలో ఉదయం 8.15గంటలకుబయలుదేరి ఇదే మార్గంలో శనివారం రాత్రి 11.50 గంటలకు ఓకా చేరుతుందన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కడప కార్పొరేషన్: జిల్లాలో ఇటీవల అనూహ్యంగా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని, జిల్లాలో విద్యుత్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఏపీ ట్రాన్స్ కో కీలకమైన అభివృద్ధి పనులను చేపడుతోందని ఏపీఎస్పీడీసీఎల్ పర్యవేక్షక ఇంజినీరు ఎస్. శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా యరగ్రుంట్ల 220/132 కేవీ సబ్స్టేషన్లో ఒక 160కేవీఏ, 220/132 కేవీ వోల్టేజ్ పవర్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు పనులు జరుగుతున్నాయన్నారు. ఈ ట్రాన్స్ఫార్మర్ పనులు పూర్తయిన తర్వాత, జిల్లాలో విద్యుత్ సరఫరా సామర్థ్యం గణనీయంగా పెరిగి, భవిష్యత్ లోడ్ అవసరాలను సులభంగా తీర్చగలుగుతామన్నారు. ఈ అత్యవసర పనులను సురక్షితంగా నిర్వహించడానికి ఈనెల 11 నుంచి 24వ తేది వరకూ జిల్లా లోని కొన్ని ప్రాంతాల్లో పగటి పూట స్వల్ప కాలి క, తాత్కాలిక అంతరాయాలు చోటు చేసుకునే అవకాశం ఉందన్నారు. ఈ అభివృద్ధి పనులకు ప్రజల సహకారం అవసరమన్నారు.


