చింతకొమ్మదిన్నె : ఏపీ రైతు సంఘం కడప జిల్లా 6వ మహాసభ ఈనెల 14న సీకే దిన్నె మండలం గంగమ్మ తోపు ఆంజనేయస్వామిగుడి దగ్గర జరుగుతుందని సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గోపాల్, దస్తగిరిరెడ్డి తెలిపారు. సోమవారం మహాసభకు సంబంధించిన గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి దస్తగిరి రెడ్డి మాట్లాడుతూ 86 శాతం రైతులు చిన్న సన్నకారు రైతులే అని, సరైన మద్దతు ధర లేక, రుణాలందక అప్పుల బారిన పడుతున్నారని ఆయన తెలిపారు. అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని , డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం మద్దతు ధరల గ్యారెంటీ చట్టం తీసుకురావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.ఈ మహాసభలో వివిధ కార్యక్రమాలకు సంబంధించి సమీక్షించి భవిష్యత్ పోరాటాలకు ప్రణాళిక రూపకల్పన చేయనున్నట్లు చెప్పారు. ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.ప్రభాకర్ రెడ్డి మహాజభకు హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు.రైతు సోదరులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గోపాలకృష్ణయ్య, మండల కమిటీ అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాసులురెడ్డి,చిన్న సిద్దయ్య,నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


