చక్రాయపేట: గండి వీరాంజనేయ స్వామి సన్నిధిలో నూతన ఆలయ జీర్ణోద్ధరణ,మహాకుంభాభిషేక మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు శుక్రవారం సాయంత్రం నుంచి సాంప్రదాయబద్ధంగా పాపాఘ్ని నదీ జలాలను తెచ్చి స్వామి వారికి సమర్పించిన అనంతరం వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా భగవత్ విజ్ఞాపనం, విశ్వక్షేన ఆరాధన,రక్షాబంధనం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. దేవదాయశాఖ డిప్యూటి కమిషనర్ ఆలయ సహాయకమిషనర్ గురుప్రసాద్, చైర్మన్ వెంకటస్వామి పర్యవేక్షణలో ఆలయ ప్రధాన ఉపప్రధాన, ముఖ్య అర్చకులు కేసరి,రాజారమేష్,రాజగోపాలాచార్యులపర్యవేక్షణలో టీటీడీ ఆగమశాస్త్ర సలహాదారులు రాజేష్స్వామి, విజయ్ స్వామి శిష్య బృందం వేద మంత్రాలతో ప్రారంభించారు. గండి భూమానందాశ్రమ పీఠాధిపతి మాతాజీ, వేదపారాయణదారు రామమోహన్ శర్మ,గండి ఆలయ మాజీ సహాయకమిషనర్ అలవలపాటి ముకుందరెడ్డి,మాజీ చైర్మన్ వీరభాస్కర్ తో పాటు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.


