సింహాద్రిపురం : సింహాద్రిపురం మండలం చవ్వారిపల్లె గ్రామంలో గురువారం పోలీసులు, టీడీపీ నాయకులు కలసి హైడ్రామా నడిపి రాత్రి సమయంలో ఫిర్యాదుదారుడు వెంకటసుబ్బయ్యతో కలిసి దౌర్జన్యంగా మా ఇంటి వద్ద ఉన్న ట్రాక్టర్లు తీసుకెళ్లడం ఎంతవరకు సబబు.. ఇది న్యాయమేనా అని మహిళలు పోలీసులను ప్రశ్నిస్తున్నారు. శుక్రవారం చవ్వారిపల్లె గ్రామంలో మహిళలు మాట్లాడుతూ గ్రామంలో దేవాలయానికి సంబంధించి 8ఎకరాల దేవుని మాన్యం భూమి ఉందని, గతంలో గ్రామస్తులంతా కలిసి మూడేళ్లకొకసారి ఆ భూమికి వేలంపాట నిర్వహించడం జరుగుతోందన్నారు. ఆ వేలంపాటలో ఎక్కువ పాడిన వారు ఆ రోజే రెండేళ్లకు సంబంధించి డబ్బు కట్టి భూమి పనులు చేస్తున్న సమయంలో మరొక సంవత్సరం డబ్బు కట్టాల్సి ఉందని, కానీ ఇది ఏమి చేయకుండా టీడీపీ వారు దౌర్జన్యంగా కట్టుబడి వెంకటసుబ్బయ్య కలసి ట్రాక్టర్ సహాయంతో దేవునిమాన్యం భూమిలో దున్నడానికి వెళ్లారన్నారు. ఇది తెలుసుకున్న గ్రామస్తులు ఇది మంచి పద్ధతి కాదని, గ్రామ కట్టుబాటు ప్రకారం జరగాల్సిందేనని, దున్నే ట్రాక్టర్ను అడ్డుకోవడం జరిగిందన్నారు. దీనిపై ఆగ్రహించిన టీడీపీ నాయకులు గ్రామానికి చెందిన 12మందిపై అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేసి ఒక ట్రాక్టర్ను పోలీసులచేత సీజ్ చేయించారన్నారు. అయితే బుధవారం టీడీపీ నాయకులు పోలీసులను వెంట పెట్టుకుని దౌర్జన్యంగా ఆ భూమిని దున్ని చదును చేసుకున్నారని, అయితే ఎండోమెంట్ వారు దేవాలయానికి సంబంధించిన భూమి వేలం పాట నిర్వహించడానికి ఒక తేదీని ఖరారు చేసి ప్రకటించాలని నివేదిక పంపారన్నారు. ఇదేమి పట్టించుకోని పోలీసులు మళ్లీ గురువారం రెండు ట్రాక్టర్లపై కేసు నమోదు చేశామని ఎస్ఐ నాయక్ పోలీసులు, ఫిర్యాదుదారుడు వెంకటసుబ్బయ్యతో వచ్చి ఒక ట్రాక్టర్ను వెంకటసుబ్బయ్య, మరొక టాక్టర్ను పోలీస్ సిబ్బంది తీసుకెళ్లారన్నారు. పోలీసులు న్యాయపరంగా వ్యవహరించాలి తప్ప.. టీడీపీ నాయకులు ఏది చెబితే అది చేయడం, దొంగ కేసులు బనాయించడం మంచి పద్ధతి కాదన్నారు. ఫ్రెండ్లీ పోలీసులంటే టీడీపీ కార్యకర్తలుగా వ్యవవరించడమేనా అని ప్రశ్నిస్తున్నారు. పోలీసుల తీరును ఎండగట్టడానికి న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నామని మహిళలు పేర్కొన్నారు.
న్యాయ పోరాటానికి సిద్ధమైన చవ్వారిపల్లె మహిళలు


