కడప కోటిరెడ్డిసర్కిల్ : ఇంటి కొనుగోలుకు సంబంధించి తమ వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి దౌర్జన్యంగా వ్యవహరిస్తున్న వారి బారి నుంచి తమను కాపాడి న్యాయం చేయాలని వేంపల్లెకు చెందిన నాగిశెట్టి రాజేశ్వరి, శ్రీనివాసులు కోరారు. శుక్రవారం వారు మీడియా ఎదుట తమ ఆవేదన వ్యక్తం చేశారు. వేంపల్లె ప్రాంతానికి చెందిన తమకు కరీముల్లా, అమానుల్లాలు 32 లక్షలకు నాలుగురోడ్ల కూడలిలో ఓ ఇంటిని అగ్రిమెంట్ రాసిచ్చారన్నారు. అనంతరం పలుమార్లు అగ్రిమెంట్ చేయించాలని కోరుతున్నా తప్పించుకుని తిరుగుతున్నారన్నారు. కరీముల్లా 33 లక్షలు తీసుకుని పారిపోయి 8 సంవత్సరాలు తర్వాత వచ్చి మా పట్ల దౌర్జన్యం చేయాలని చూస్తున్నారన్నారు. ఇంటికి సంబంధించి అన్ని పత్రాలు తమ వద్ద ఉన్నప్పటికీ రౌడీలను తీసుకొచ్చి ఇంటిని ఆక్రమించాలని చూస్తున్నారన్నారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదుచేసినా నేడు, రేపు అంటూ కేసు నమోదుకు కాలయాపన చేస్తున్నారన్నారు. ఇప్పటికై నా జిల్లా కలెక్టర్, ఎస్పీలు జోక్యం చేసుకుని తమకు తగిన న్యాయం చేయాలని, దౌర్జన్యపరుల బారి నుంచి కాపాడాలని కోరుతున్నారు.


