ప్రొద్దుటూరు క్రైం : నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ఇద్దరి మృతికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్ను రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఈ నెల 1న జమ్మలమడుగు బైపాస్ రోడ్డులోని శ్రీదేవి ఫంక్షన్ హాల్ వద్ద దువ్వూరు మండలంలోని కృష్ణంపల్లెకు చెందిన అందె నరసింహలు, నంద్యాల జిల్లా, చాగమలమర్రికి చెందిన ఆకుమల్ల షరీఫ్, చిన్నవంగలికి చెందిన ఇమాంఖాసీంలు నిలుచుని ఉండగా నంగనూరుపల్లెకు చెందిన పోతుబోయిన సుమన్ అనే వ్యక్తి నిర్లక్ష్యంగా ట్రాక్టర్ నడుపుతూ ఈ ముగ్గురు వ్యక్తులను ఢీ కొన్నాడు. ఈ ఘటనలో అందె నరసింహులు, ఆకుమల్ల షరీఫ్లు అక్కడిక్కడే మృతి చెందగా ఇమాంఖాసీం తీవ్రంగా గాయపడ్డాడు. ట్రాక్టర్తో వారిని ఢీ కొన్న అతను అక్కడి నుంచి ట్రాక్టర్తో సహా పరారయ్యాడు. రూరల్ సీఐ నాగభూషణ్ పర్యవేక్షణలో రూరల్ ఎస్ఐలు శ్రీకాంత్, రాజులు నిందితుడిని గుర్తించారు. ఈ క్రమంలో డ్రైవర్ పోతుబోయిన్ సుమన్ను గురువారం అరెస్ట్ చేశారు. పట్టణ శివారు ప్రాంతంలో దాచిన ట్రాక్టర్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు అతనిపై కేసు నమోదు చేసి రిమాండుకు పంపించనున్నట్లు సీఐ తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన ఇమాంఖాసీం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.


