మైదుకూరు : మైదుకూరు మండలం పెద్దశెట్టిపల్లెకు సమీపంలో మైదుకూరు – బద్వేలు రహదారిపై బుధవారం టిప్పర్ ఆటోను ఢీకొన్న సంఘటనలో ఆటో డ్రైవర్ పీట్ల సంటెయ్య (53) మృతి చెందాడు. ఆటోలో ఉన్న యువకుడికి గాయాలయ్యాయి. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని సోమయాజులపల్లెకు చెందిన నాగసుబ్బయ్య కుమార్తె వివాహం రెండు రోజుల్లో జరగనుంది. ఆ సందర్భంగా ఇంటికి రంగులు వేయించేందుకు జీవీ సత్రంలోని టెంట్ హౌస్ నుంచి ఇనుప స్టాండ్లు అద్దెకు తీసుకొచ్చారు. రంగులు వేయడం అయిపోవడంతో స్టాండ్లను తిరిగి ఇచ్చేందుకు నాగసుబ్బయ్య కుమారుడు మల్లికార్జున బుధవారం ఉదయం అదే గ్రామానికి చెందిన పీట్ల సంటెయ్య ఆటోలో తీసుకొని జీవీ సత్రానికి వెళుతున్నారు. పెద్దశెట్టిపల్లెకు సమీపంలో వెనుక వైపు నుంచి వచ్చిన టిప్పర్ ఆటోను ఢీకొంది. ఆటో జాతీయ రహదారిపై పల్టీలు కొట్టడంతో ఆటో డ్రైవర్ సంటెయ్య తలకు తీవ్ర రక్తగాయాలు కాగా, మల్లికార్జునకు స్వల్ప గాయాలయ్యాయి. సంటెయ్యను చికిత్స కోసం 108 అంబులెన్స్లో కడప రిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. సంఘటన స్థలాన్ని మైదుకూరు అర్బన్ పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఒకరు మృతి


