కడప అర్బన్: కడప నగరం మాచుపల్లి బస్టాండ్ సమీపంలోని ఆకుల వీధిలో సోమవారం ఓ పాత మిద్దె కూలిపోయింది. ఈ ప్రమాదంలో కాకర్ల సరస్వతి (42) అక్కడికక్కడే మృతి చెందింది. ఆ ఇంట్లో ఉన్న మరో ముగ్గురు గాయపడ్డారు. కడప టూ టౌన్ సీఐ ప్రసాద్ రావు ఎస్సై రఫీ.రెవిన్యూ. ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని భవనంలో ఇరుక్కున్న వారిని బయటికి తీశారు. కడప టూ టౌన్ సీఐ వివరాల మేరకు.... ఆకుల వీధికి చెందిన సరస్వతి చౌడుమిద్దెలో నివాసం ఉంటున్నారు. మిద్దె కిందికి వంగిపోవడంతో పనులు చేయించేందుకు సోమవారం ఉదయం బేల్దారి వీరన్న, లక్ష్మీదేవిలను పిలిపించుకున్నారు. సరస్వతి చిన్నాయన సూరయ్య కూడా ఇంటి వద్ద ఉండి వంగిపోయిన ఇంటిని పరిశీలిస్తున్నారు. పనులు చేయాలనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా వారిపై మిద్దె కూలిపోయి పడిపోయింది. ఈ ప్రమాదంలో సరస్వతి మృతి చెందింది. మిగిలిన ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతదేహాన్ని రిమ్స్ మార్చురీకి తరలించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలియజేశారు.


