కడప సెవెన్రోడ్స్ : పీజీఆర్ఎస్లో వచ్చే అర్జీలను సత్వరమే పరిష్కరించాలని ఇన్చార్జి డీఆర్వో వెంకటపతి అన్నారు. సోమవారం కలెక్టరేట్ సభా భవనంలో నిర్వహించిన పీజీఆర్ఎస్లో ప్రజల వినతులు ఆయన పరిశీలించారు. ప్రజల సమస్యలను జీరో శాతానికి తీసుకు రావడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అర్జీదారుల సమస్యలను నాణ్యతతో గడువులోపు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అర్జీల్లో కొన్ని..
వీఆర్వో నా భూమి ఆక్రమించారు
మా గ్రామ పొలం సర్వే నెంబరు 408లో 1.18 ఎకరాలు, 409లో 0.30 సెంట్ల భూమి నాకు పూర్వీకుల నుంచి సంక్రమించింది. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్ల ఆధారాలు సైతం ఉన్నాయి. కాగా, కిశోర్ అనే వీఆర్వో నా భూమిని ఆక్రమించారు. విచారించి న్యాయం చేయాలని కోరేందుకు వచ్చాను. – నీరుగట్టు రామయ్య,
రేకులకుంట, బి.మఠం మండలం
రహదారి సౌకర్యం కల్పించాలి
నేను 1998లో మా గ్రామానికి చెందిన భూమిరెడ్డి రామసుబ్బమ్మ వద్ద నుంచి సర్వే నెంబరు 978/2లో 2.51 ఎకరాల భూమిని కొనుగోలు చేశాను. రిజిస్టర్ కూడా జరిగింది. పూర్వం నుంచి అక్కడ రహదారి ఉంది. ఇప్పుడు అడ్డంకులు కల్పిస్తున్నారు. భూమి సర్వే చేయించి ఉత్తరం వైపు ఉన్న పూర్వపు దారిని పునరుద్ధరించాలని కోరుతున్నాను.
– మునెయ్య, రమణమ్మ, గోపవరం
అర్జీలకు స్పందించేవారే లేరు
మా గ్రామ పొలం సర్వే నెంబరు 155లో నా పేరిట 2.91 ఎకరాల భూమి ఉంది. నా భూమి పక్కనే మైలవరం రిజర్వాయర్ అధికారులు నేల బ్రిడ్జి నిర్మించా రు. ఇందువల్ల 2019 నుంచి 15 సెంట్లు నా భూమి ముంపునకు గురవుతోంది. పరిహారం ఇచ్చి ఆదుకోవాలని పలుమార్లు అర్జీలు సమర్పిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.
– నాగలింగం, పి.సిరిగేపల్లె, జమ్మలమడుగు
ఇన్చార్జి డీఆర్వో వెంకటపతి


