రాజంపేట టౌన్: ఈనెల ఏడో తేదీ నిర్వహించనున్న బలిజపల్లె గంగమ్మ జాతరకు ఆదివారం రాత్రి నిర్వాహకులు అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గతంలో ఎన్నడు లేని విధంగా భక్తులు వేలాదిగా తరలి వచ్చారు. అనేక మంది అంకురార్పణ వేడుకను చూసేందుకు గ్రామంలోని మిద్దెలపైకి ఎక్కారు. ఇదిలావుంటే పెద్దఎత్తున తప్పెట్ల వాయిద్యాలు, కొమ్ము ఊదడం, ఆసాదుల ఆశీర్వాదం, గంగమ్మ ఆవహించిన భక్తులు ఊగిపోవడం వంటి కార్యక్రమాల మధ్య జాతర అంకురార్పణ వేడుకను నిర్వాహకులు చేపట్టారు. పోతు మెడలో దండ పడగానే భక్తులు ఒక్కసారిగా గట్టిగా ఈలలు, కేకలు వేయడంతో బలిజపల్లె గ్రామం దద్దరిల్లింది. అంకురార్పణ వేడుక సందర్భంగా పెద్ద ఎత్తున బాణా సంచా కాల్చారు
● ఇటీవల కాలంలో గంగమ్మ జాతర అంకురార్పణ సందర్భంగా కొంత మంది నిర్వాహకుల మధ్య వివాదాలు తలెత్తాయి అయితే ఈ ఏడాది చిన్నపాటి వివాదాలకు తావులేకుండా అంకురార్పణతో పాటు జాతర ముగిసే వరకు జరిగే అన్ని కార్యక్రమాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఏఎస్పీ రామ్నాఽథ్హెగ్డే ముందస్తు ప్రణాళికలను రూపొందించారు. అందులో భాగంగా పోలీసులు జాతర నిర్వాహకులతో సమావేశాలు ఏర్పాటు చేసి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఫలితంగా జాతర నిర్వహణకు తొలిఘట్టమైన అంకురార్పణ కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో ముగిసింది.
గంగమ్మ జాతరకు అంకురార్పణ చేస్తున్న నిర్వాహకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు


