రాజంపేట టౌన్ : కళాకారులు కారణ జన్ములని ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి పేర్కొన్నారు. సాంస్కృతికశాఖ సహకారంతో కళాకారుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు జబ్బిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఈనెల 1వ తేదీ నుంచి రాజంపేట పట్టణంలోని గాంధిమెమోరియల్ కళామందిర్ (జిఎంసీ)లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు శనివారం రాత్రి ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా పాల్గొని ప్రముఖ రంగస్థల కళాకారులను సత్కరించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సెల్ఫోన్ అందుబాటులోకి రావడంతో ప్రజలకు వినోదానికి కొదవలేకుండా పోయిందని, అందువల్ల కళారంగంపై ప్రజలకు ఆసక్తి కూడా సన్నగిల్లుతుందన్నారు. ఇలాంటి తరుణంలో కళాకారుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు జబ్బిరెడ్డి వెంకటరెడ్డి రంగస్థల కళారంగాన్ని జవసత్వాలు పోస్తున్నారన్నారు. జిల్లాలో రాజంపేటలోనే నాటక ప్రదర్శనలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. భారతదేశానికి స్వాతంత్య్రం రావడంలో కళాకారుల పాత్ర కూడా ఎంతో ఉందన్నారు. సమాజంలో ప్రజలను చైతన్యవంతులు చేసే శక్తి కళాకారులకు ఉందని తెలిపారు. ఈకార్యక్రమంలో ఊటుకూరు ఎంపీటీసీ నాగా శేఖర్రెడ్డి, వివిధ సంస్థలకు చెందిన కళాకారులు జబ్బిరెడ్డి వెంకటరెడ్డి, మందరం వెంకట సుబ్బారెడ్డి, చిన్నపోలు జయరామిరెడ్డి, తుమ్మలపెంట వేణుగోపాల్, ఏవీ.సుబ్బరాజు, పసుపులేటి గోపినాధ్, సంగీత సుబ్బరాయుడు, వేలూరు కృష్ణయ్య, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి


