ఎర్రగుంట్ల : ఆగి ఉన్న లారీని ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులో పనిచేస్తున్న చిత్తకంట వెంకటసుబ్బయ్య (55) మృతి చెందాడు. శనివారం అర్థరాత్రి చోటు చేసునన్న ఘటనకు సంబంధించి ఎర్రగుంట్ల ఎస్ఐ నాగమురళి కథనం మేరకు వివరాలు..కలమల్ల గ్రామానికి చెందిన చిత్తకుంట వెంకటసుబ్బయ్య ఆర్టీపీపీలో పనిచేస్తున్నాడు, ఇతనికి భార్య నారాయణమ్మ, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వీరిలో పెద్ద కుమార్తెకు వివాహమైంది. చిలంకూరులో జరుగుతున్న పెళ్లికి హజరు కావడానికి బైక్లో శనివారం రాత్రి బయలు దేరాడు. చిలంకూరు గ్రామంలోని ఐసీఎల్ వద్ద రాత్రి రోడ్డుకు అడ్డంగా ఎలాంటి సిగ్నిల్ లైటింగ్ వేయకుండా లారీని డ్రైవర్ నిర్లక్ష్యంగా నిలబెట్టి ఉన్నారు.చీకట్లో లారీని వెంకటసుబ్బయ్య గమనించకుండా ఢీకొన్నాడు. తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతన్ని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం మరో ఆసుపత్రికి తీసుకెళుతుండగా వెంకటసుబ్బయ్య మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.


