– కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి
పులివెందుల : జిల్లా ప్రజలకు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అహంకారం, స్వార్థం వంటి దుర్గుణాలను జయించి ముందుకు సాగడమే పరాభవ అర్థమని పేర్కొన్నారు. ఏడాదంతా రైతులకు సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండి సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. అలాగే అన్ని వర్గాల వారికి తాము ఎంచుకున్న రంగాలలో విజయాలు కలిగి ముందుకు సాగాలని ఆయన కోరుకున్నారు.
151 మంది గైర్హాజరు
కడప ఎడ్యుకేషన్: పదో తరగతి పరీక్షలు రెండవ రోజు ప్రశాంతంగా జరిగాయి. బుధవారం జరిగిన సెకండ్ లాంగ్వేజ్ హిందీ పరీక్షకు జిల్లావ్యాప్తంగా 167 పరీక్షా కేంద్రాలలో 27732 మంది విద్యార్థులకుగాను 27581 మంది హాజరుకాగా 151 మంది గైర్హాజరయారు. పరీక్షల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన 7 ఫ్లయింగ్ స్వ్కాడ్ బృందాలు 49 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేయగా 80 పరీక్షా కేంద్రాలలో సిట్టింగ్ స్వాడ్ ఏర్పాటు చేశారు. అలాగే ఓపెన్ పది పరీక్షలకు సంబంధించి ఇంగ్లీష్ పరీక్షకు 31 పరీక్షా కేంద్రాలకుగాను 2386 మంది అభ్యర్థులకుగాను 1969 మంది హాజరుకాగా 387 మంది గైర్హాజరయ్యారు. కడప మున్సిపల్ హైస్కూల్ బాయిస్లో ఒకరిని డీబార్ చేసినట్లు డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు.
వాల్మీకిపురం: వాల్మీకిక్షేత్రంలోని శ్రీరాముడి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిద్దామని టీటీ డీ డిప్యూటీ ఈవో వరలక్ష్మి అన్నారు. బుధవారం స్థానిక పట్టాభిరామాలయంలో టీటీడీ అధికారులు, అర్చకులతో కలసి వార్షిక బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ నెల 23 నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమవుతాయన్నారు. అలాగే 29న శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం , 30వ తేది రథోత్సవం, 2వ తేది పుష్పయాగంతో ఉత్సవాలు ముగియనున్నాయి. ప్రజలంతా పెద్ద ఎత్తున పాల్గొని, స్వామి వారి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయా లని ఆమె కోరారు. టీటీడీ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.


