మదనపల్లెటౌన్: మదనపల్లె పట్టణం, బెంగుళూరు రోడ్డులోని రేస్ బీఈడీ కాలేజి వద్ద నూతనంగా నిర్మించిన జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీన్ బుధవారం ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, కలెక్టర్ నిశాంత్ కుమార్, అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు. అంతకుముందు వేద పండితుల ఆశీర్వచనాలు, మంగళవాయిద్యాల నడుమ సాయుధ పోలీసుల దళం (ఏఆర్) గౌరవ వందనం స్వీకరించిన అనంతరం అధికారులు కార్యాలయంలోని వివిధ విభాగాలను రికార్డు గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా డీఐజీ, ఎస్పీ మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా పోలీస్ శాఖకు ఇది ఒక మైలురాయి అన్నారు. అత్యాధునిక , సాంకేతిక, మెరుగైన వసతులతో ఈ కార్యాలయాన్ని తీర్చిదిద్దడం జరిగిందన్నారు. ఇక నుంచి సేవలన్నీ ఎస్పీ కార్యాలయంలోనే జిల్లా ప్రజలు పొందవచ్చు అని తెలిపారు. టెక్నాలజీని వాడుకుంటూ నేర నియంత్రణలోనూ ప్రజల ఫిర్యాదులు పరిష్కరించడంలోనూ ముందుకు పోతున్నట్లు చెప్పారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరణకు రాజీ పడకుండా ప్రజలకు సేవలు అందిస్తామని పేర్కొన్నారు. కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ.. పాలనా వికేంద్రీకరణ వల్ల సామాన్య ప్రజలకు ప్రభుత్వ సేవలు సులభతరం అవుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో రాయచోటి డీఎస్పీలు ఏడుకొండలు, కృష్ణమోహన్, జిల్లా కార్యాలయంలోని వివిధ విభాగాల అధికారులు, సీఐ, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.


