మదనపల్లెటౌన్ : వేర్వేరు కారణాలతో ముగ్గురు ఆత్మహత్యకు యత్నించారు. పోలీసుల కథనం మేరకు.. కలికిరి మండలం, మంచూరుకు చెందిన శివశంకర్(40) ప్రైవేట్ వాహన డ్రైవర్ గా పనిచేస్తాడు. మూడు రోజుల క్రితం శివశంకర్తో గొడవపడి గీత పుట్టినిల్లు అయిన చౌడేపల్లెకు అలిగి వచ్చేసింది. దీంతో భర్త భార్యను కాపురానికి పిలవడానికి అత్తగారి ఇళ్లు అయిన చౌడేపల్లెకు మంగళవారం వచ్చాడు. అక్కడ ఏం జరిగిందో ఏమో పురుగుల మందు తాగాడు.. గమనించిన స్థానికులు చౌడేపల్లి 108 సమాచారం అందించడంతో వారు అతన్ని మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అత్యవసర విభాగం వైద్యులు అతనికి మెరుగైన వైద్యం అందించి, ఆరోగ్యం కుదుట పడకపోవడంతో తిరుపతి రుయాకు వెళ్లాలని రెఫర్చేశారు. ఘటనపై చౌడేపల్లె పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
● మరో ఘటనలో అనంతపురం జిల్లా, పెనుగొండకు చెందిన జేసీబీ డ్రైవర్ వి.గణేష్(23) మదనపల్లెకు వచ్చి స్థానిక నీరుగట్టువారిపల్లె సమీపంలోని అమ్మచెరువుమిట్ట డౌన్ లో పురుగుల మందు తాగాడు. స్థానికులు గమనించి 108కు సమాచారం అందించడంతో వారు బాధితున్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. అయితే అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆస్పత్రి సిబ్బంది కుటుంబీకుల సమాచారం అందించారు. వారు ఎంతకూ రాకపోవడంతో ఆస్పత్రిలోనే అడ్మిట్ చేశారు. వన్ టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
● మదనపల్లె పట్టణం, నిమ్మనపల్లె క్రాస్ రోడ్డులో నివశిస్తున్న నాగేంద్ర(43), క్రాస్ రోడ్లు చికెన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. కుటుంబ సమస్యల కారణంగా తాను ఉంటున్న ఇంట్లోనే తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డాడు. కుటుంబీకులు గమనించి బాధితున్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి అతని పరిస్థితి ఆందోళన కరంగా ఉందని రుయారు రెఫర్ చేశారు.


