● తక్షణం ఖాళీ చేయాలి : మఠాధిపతి
● గడువు కావాలి : మారుతీ మహాలక్ష్మమ్మ
బ్రహ్మంగారిమఠం: శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠం అధికారిక నివాసం విషయంలో ప్రస్తుత మఠాధిపతి వెంకటాద్రి స్వామి, పూర్వపు మఠాధిపతి రెండో భార్య మారుతీ మహాలక్ష్మమ్మ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇరుపక్షాల వాదనలు ఇలా ఉన్నాయి.
తక్షణం ఖాళీ చేయాల్సిందే: మఠాధిపతి వెంకటాద్రి స్వామి
‘మఠాధిపతిగా నన్ను ఎన్నుకున్నందున, మఠం ఆభరణాలు, రికార్డులు నాకు అప్పగించారు. సిద్ధాంతం ప్రకారం మఠాధిపతి నివాసంలో కేవలం పీఠాధిపతి కుటుంబం మాత్రమే ఉండాలి. హోమాలు నిర్వహించి మేము అక్కడికి చేరుకుంటాం. మహాలక్ష్మమ్మ అక్కడ ఉంటే మాకు భద్రత ఉండదు. ఇప్పటికే అధికారుల ద్వారా ఆమెకు సమాచారం ఇచ్చాం. గతంలో ఆమె స్వయంగా ‘నియామకం జరిగితే ఖాళీ చేస్తానని’ చెప్పిన వీడియో క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి. తక్షణం ఖాళీ చేయకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.’
మూడు నెలల సమయం కావాలి: మారుతీ మహాలక్ష్మమ్మ
‘మహానివేదన మందిరంలో మఠాధిపతి కుటుంబం ఉండాలనేది నిజమే. కానీ, నేను నా ఇద్దరు పిల్లలతో బయటకు వెళ్లాలంటే కనీసం మూడు నెలల గడువు కావాలి. ఆస్తుల భాగ పరిష్కారాలు ఇంకా జరగలేదు, మేము ఎక్కడికి వెళ్లాలో కూడా తెలియని పరిస్థితి. కనీసం నా పనిమనుషులను కూడా ఉంచడం లేదు. మఠాధిపతి నుంచి అధికారికంగా లేఖ వస్తే ఖాళీ చేసే విషయం ఆలోచిస్తాను. నా వల్ల వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు, వారి పని వారిది.. నా పని నాది.’
ఒకవైపు ఆచారాల ప్రకారం నివాసం ఖాళీ చేయాలని మఠాధిపతి పట్టుబడుతుండగా, మరోవైపు మానవతా దృక్పథంతో గడువు కావాలని మహాలక్ష్మమ్మ కోరుతున్నారు. ఈ వివాదం ఇప్పుడు భక్తుల్లో, స్థానికుల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.


