ప్రొద్దుటూరు : మున్సిపాలిటీ పరిధిలోని ఆంధ్రకేసరి రోడ్డుకు చెందిన బోదన సలోమి రెండేళ్లు దాటినా ఉపాధి లభించకపోవడంతో ఎదుచూస్తూ ఉంది. సలోమి భర్త ఓబులేసు మున్సిపాలిటీ ఔట్సోర్సింగ్ విభాగంలో లారీ డ్రైవర్గా పనిచేస్తూ 2024 మార్చి 5వ తేదీన అనారోగ్యంతో మృతి చెందాడు. భర్త స్థానంలో తనకు ఉపాధి కల్పించాలని ఆమె ఇప్పటి వరకు అధికారులను, ప్రజాప్రతినిధులను వేడుకున్నా ఫలితం లేకుండా పోయింది. మరో వైపు గత రెండేళ్లుగా వితంతువు అయిన ఈమె సామాజిక పింఛన్కు కూడా నోచుకోలేదు. రెండేళ్లుగా కూటమి ప్రభుత్వం కొత్త పింఛన్లు ఇవ్వకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. చేసేందుకు పని లేకపోవడంతోపాటు పింఛన్ రాకపోవడంతో కుటుంబ భారాన్ని మోయడం ఆమెకు కష్టంగా మారింది. ఈమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈమె మున్సిపాలిటీలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కూడా ఫిర్యాదు చేసింది.
ఎర్రచందనం కేసులో జైలుశిక్ష, జరిమానా
సిద్దవటం: తమిళనాడు రాష్ట్రానికి చెందిన అన్నామలై పలని స్వామి అనే ముద్దాయికి ఎర్రచందనం కేసులో తిరుపతి ఎర్రచందనం ప్రత్యేక కోర్టు జడ్జి నరసింహమూర్తి జైలుశిక్ష, జరిమానా విధించినట్లు తీర్పును వెలువరించారు. 2017 సంవత్సరంలో సిద్దవటం రేంజ్లో సిద్దవటం బీట్లో తమిళనాడుకు చెందిన అన్నామలై పలని స్వామి అనే వ్యక్తి ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డాడు. ఆ కేసుకు సంబంధించి ఫైనల్ జడ్జిమెంట్ మంగళవారం తిరుపతి ప్రత్యేక కోర్టు నరసింహమూర్తి అతనికి ఐదు సంవత్సరాల శిక్ష, రూ.6 లక్షల జరిమానా విధించినట్లు తీర్పును వెలువరించారు. సిద్దవటం అటవీ అధికారి కళావతి మాట్లాడుతూ ఎర్రచందనం కేసులో ముద్దాయికి శిక్ష పడటానికి సిద్దవటం అటవీ సిబ్బంది కృషి అభినందనీయమని కొనియాడారు.


