పులివెందుల టౌన్ : ఓ వైపు పదోతరగతి పరీక్షలు ప్రారంభం.. మరోవైపు తండ్రి మరణంతో పుట్టెడు దుఃఖంలోనూ విద్యార్థిని పరీక్ష రాసిన ఘటన సోమవారం పులివెందులలో చోటుచేసుకుంది. వివరాలు.. పులివెదుల పట్టణంలోని స్థానిక బయమ్మ తోటలో నివాసం ఉంటున్న దండు శివయ్య గత కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతుండేవాడు. ఆదివారం రాత్రి శివయ్య మృతి చెందాడు. ఆయన మృతితో కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. శివయ్యకు భార్య భాగ్యమ్మతోపాటు కుమార్తె దండు ధరణి, కుమారుడు ధనుష్లు ఉన్నారు. ప్రస్తుతం ధరణి పదోతరగతి చదువుతోంది. తెల్లవారితే పది పబ్లిక్ పరీక్ష.. తండ్రి చనిపోయిన బాధ ఒకవైపు.. పరీక్షలు రాయాలనే తలంపు మరో వైపు. దిక్కుతోచని పరిస్థితిలో ధరణి బాధాతప్త హృదయంతో దుఃఖాన్ని దిగమింగుకుని పులివెందుల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పరీక్ష రాసింది. ఈ సంఘటన పలువురిని కలిచివేసింది.
పాము కాటుతో రైతు మృతి
వేంపల్లె : వేంపల్లె మండలంలోని బక్కన్నగారిపల్లెలో పాము కాటుతో రైతు పి.మహేందర్ (35) మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. వివరాలు.. మండలంలోని బక్కన్నగారిపల్లె గ్రామానికి చెందిన మహేందర్ తన నిమ్మ తోటలోకి ఈ నెల 11వ తేదీ వెళ్లారు. పాము కాటుకు గురి కావడంతో నాటు వైద్యంతోపాటు పుట్టపర్తిలోని సత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ ఆసుపత్రిలో చికిత్స చేయించినట్లు బంధువులు చెప్పారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆదివారం సాయంత్రం మహేందర్ మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి భార్య పుష్పవతి, ఇద్దరు కుమారులు శశాంక్, సాత్విక్ లు ఉన్నారు. మృతుని తమ్ముడు విశ్వనాథ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వేధింపులపై కేసు నమోదు
కొండాపురం : అదనపు కట్నం కోసం ఓ మహిళను భర్త, అత్త, మామ వేధింపులకు గురి చేయడంతో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు తాళ్లప్రొద్దుటూరు ఎస్ఐ మంజునాథ సోమవారం తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల మేరకు మండలంలోని దొబ్బుడుపల్లెగ్రామానికి చెందిన బత్తుల శ్రీనివాసులతో నంద్యాల జిల్లాలోని సంజాల మండలం రెడ్డిపల్లె కు చెందిన నాగలక్ష్మికి రెండేళ్ల కిందట వివాహం జరిగింది. కొంతకాలం వీరి కాపురం సజావుగా సాగింది.అదనపు కట్నం కోసం భార్యను చిత్రహింసలు పెడుతుండటంతో గతంలో ఇతన్ని బంధువులు మందలించారు. తన కూతురును ఎందుకు వేధిస్తున్నారని నాలక్ష్మి తల్లి శివమ్మ అడగ్గా తండ్రి, తల్లితో కలిసి అల్లుడు కొట్టడంతో ఆమె తలకు తీవ్రగామైంది.నాగలక్ష్మి ఫిర్యాదు మేరకు ముగ్గరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ తెలిపారు.


