కడప సెవెన్రోడ్స్ : రెవెన్యూ సమస్యల పరిష్కార ప్రాధాన్యతతోపాటు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే దిశగా చేపట్టిన ‘రైతన్నా మీకోసం‘కార్యక్రమాన్ని జిల్లాలో ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని జేసీ డాక్టర్ నిధి మీనా సంబంధిత అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ లోని సభా భవన్ హాలులో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమానికి జేసీ డా. నిధి మీనా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులతో జేసీ మాట్లాడుతూ భూ వివాదాల శాశ్వత, పరిష్కారానికి పీజీఆర్ఎస్ సేవలతో పాటు ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్స్ ప్రత్యేక కౌంటర్ల ద్వారా వచ్చిన అర్జీలను రెవెన్యూ అధికారులు స్వీకరించి సత్వర పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నారన్నారు.
ఈ నెల 16 వ తేదీ నుంచి ఈ నెల 25 వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘రైతన్నా మీకోసం‘వారోత్సవాలను జిల్లాలో ప్రాధాన్యతతో అమలు చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని రైతు సేవా కేంద్రాలలో వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన అన్ని శాఖలు సమన్వయంతో విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్డీసీలు వెంకటేశ్వర్లు, రంగస్వామి, కలెక్టరేట్ ఏవో విజయ్ కుమా ర్, ఎంప్లాయిమెంట్ అధికారి సురేష్ కుమార్, గ్రౌండ్ వాటర్ డిడి మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.
జేసీ డాక్టర్ నిధి మీనా


