కడప అర్బన్: రౌడీ షీటర్లు, ట్రబుల్ మాంగర్లు, గతంలో నేరాలకు పాల్పడిన వారి కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, మట్కా, క్రికెట్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ తదితర అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా కఠిన చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో కడప సబ్– డివిజన్ నేర సమీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గ్రామ సభలు, పల్లె నిద్ర, గ్రామాల సందర్శన తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికలను సజావుగా , శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు వీలుగా రౌడీ షీటర్లు, ట్రబుల్ మాంగర్లు, గతంలో ఎన్నికల నేరాలకు పాల్పడినవారిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. వారి కదలికలపై నిఘా ఉంచాలన్నారు. భూ వివాదాలు, ఆర్ధిక పరమైన అంశాల వల్ల క్రిమినల్ కేసులు నమోదైతే వాటిని క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారులు లీగల్ ప్రొసీజర్ మేరకు కేసు విచారణ నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించి చట్టపరిధిలో సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. డ్రోన్ కెమెరాల ద్వారా గంజాయి, ఇతర మత్తు పదార్థాలు, బహిరంగ మద్యపానం చేసే వారిపై దాడులు నిర్వహించి కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.మహిళ భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గ్యాంబ్లింగ్, మట్కా, క్రికెట్ బెట్టింగ్ జరగకుండా కఠినంగా వ్యవహరించాలని, దాడులు ఉధృతం చేయాలని ఆదేశించారు.సమావేశంలో కడప డీఎస్పీ ఎ.వెంకటేశ్వర్లు తదిరులు పాల్గొన్నారు.
జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్


