కడప సెవెన్రోడ్స్: ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగఫలితం ప్రతి తెలుగువారందరికీ స్ఫూర్తిదాయకమని జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని సభాభవన్లో పొట్టి శ్రీరాములు జయంతి సంస్మరణ సభ డీఆర్వో అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ అప్పట్లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం వరుసగా 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి, చివరికి జాతి కోసం ప్రాణాలర్పించిన మహనీయులు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. దేశంలోని భాషా ప్రయుక్త రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలిచిన ఆయన మన తెలుగువారని చెప్పుకోవడం గర్వకారణం అన్నారు. కార్మిక సంక్షేమ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసులు మాట్లాడారు. విధినిర్వహణలో ప్రతి ఉద్యోగికి ఆయన విలువలు స్ఫూర్తిదాయకం అన్నారు. కార్యక్రమంలో ముందుగా జ్యోతి ప్రజ్వలన, అనంతరం అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి డీఆర్వోతో పాటు పలువురు పూలమాలవేసి నివాళులర్పించారు.
జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు


