జమ్మలమడుగు : మున్సిపాలిటీకి ఆదాయం సమకూర్చే కూరగాయాల మార్కెట్, కబేలా, బస్టాండ్లకు గతంలో వేసిన టెండర్ల సమయం పూర్తయింది. దీంతో మళ్లీ టెండర్ వేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. వైఎస్సార్సీపీకి చెందిన మున్సిపల్ కౌన్సిలర్ ముల్లాజానీ, అతని తమ్ముడు ఫయాజ్లు టెండర్లలో పాల్గొనటానికి 18 లక్షల రూపాయల విలువగల టెండర్లను తీసుకువచ్చారు. అయితే అధికారులు టెండర్ వేయటానికి ఎవరూ ముందుకు రాలేదని, టెండర్లను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మళ్లీ టెండర్లు ఎప్పుడు నిర్వహించేది మున్సిపల్ అధికారులు ప్రకటించలేదు.
అధికార పార్టీకి కట్టబెట్టేటందుకు
కమిషనర్ ప్రయత్నాలు
గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో మీరు ఎలా చేసుకున్నారో ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అలాగే జరుగుతుందని ఓ అధికారి బాహాటంగానే చెప్పుకువచ్చారు. టెండర్లను కూటమి ప్రభుత్వంలో ఉన్న కార్యకర్తలకు, నాయకులకు కట్టబెట్టేవిధంగా.. ఆది కూడా తక్కువ కోటేషన్లతో ఇచ్చేలా మున్సిపల్ అధికారులుముమ్మరంగా ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్సార్సీపీ నాయకులకు టెండర్లు వాయిదా వేశామని చెప్పి వారిని బయటకు వంపించిన తర్వాత అధికార పార్టీకి చెందిన వారి టెండర్ చెక్కులు రహస్యంగా తీసుకుని వారికే టెండర్ వచ్చినట్లు ప్రకటించడానికి యత్నిస్తున్నారు. అందులో భాగంగానే నేను, నా తమ్ముడు వేసిన టెండర్లకు సంబంధించిన చెక్కులకు తీసుకుని పోవాలని మున్సిపల్ కార్యాలయం నుంచి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని కౌన్సిలర్ వాపోతున్నారు. మున్సిపల్ కమిషనర్ అధికార పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతూ వారికే టెండర్ ఇచ్చి మున్సిపల్ అదాయానికి గండికోట్టే ప్రయత్నం చేస్తున్నారని చెబుతున్నారు.
అధికార పార్టీవారికి టెండర్లు
కట్టబెట్టేందుకు యత్నం


