ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, ప్రముఖులు
ఇఫ్తార్ విందులో పాల్గొన్న ముస్లింలు
కడప కార్పొరేషన్ : దాతృత్వానికి, దైవభక్తికి రంజాన్ మాసం ప్రతీక అని కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్రెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం బిల్టప్ సమీపంలోని షాహీ కన్వెన్షన్ సెంటర్లో మైనార్టీ నేత ఎస్ఎండీ ఆజమ్ నయీమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఎంపీతోపాటు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి, సీఈసీ సభ్యులు కె.సురేష్బాబు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా, ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి, మేయర్ పాకా సురేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలుత ఇఫ్తార్ ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ పవిత్రమైన రంజాన్ మాసంలో పాటించే ఇఫ్తార్లు పేద వారి ఆకలి విలువను తెలియజేయడంతోపాటు అధిక పుణ్య ఫలాలను చేకూరుస్తాయని తెలిపారు. అంతేగాక రంజాన్ నెలలో జరిగే ఇఫ్తార్ విందుల్లో ఆత్మీయత, సహృద్భావాలు ప్రస్పుటమవుతాయన్నారు. పరస్పర ధోరణికి, విశాల ఆలోచనా దృక్పథానికి ఇఫ్తార్ విందు నిదర్శనమన్నారు. పవిత్ర ఆరాధనలకు, ధార్మిక చింతనకు, క్రమశిక్షణకు రంజాన్ మాసం ఆలవాలంగా నిలుస్తుందన్నారు. ప్రజలు సుభిక్షంగా, సంతోషంగా ఉండాలని అల్లాహ్ను ప్రార్థిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరిపై అల్లాహ్ ఆశీస్సులు మెండుగా ఉండాలని ఎంపీ ఆకాంక్షించారు. అనంతరం ముస్లిం ప్రముఖులతో కలిసి మగరీబ్ ప్రార్థనలు సామూహికంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మైనార్టీ విభాగం అధ్యక్షుడు దస్తగిరి, ఎస్ఈసీ సభ్యులు డాక్టర్ సొహైల్, మైనార్టీ నేతలు నజీర్ అహ్మద్, సలావుద్దీన్, గౌస్, షఫీవుల్లా, జమీల్, సీహెచ్ వినోద్ తదితరులు పాల్గొన్నారు.
కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి


