పులివెందుల రూరల్ : పట్టణ పరిధి పార్నపల్లె రోడ్డు సమీపంలోని లక్ష్మీహాలు వీధిలో భారీ వృక్షం నేలకొరిగింది. చెట్టు కూలి విద్యుత్ తీగలపై పడటంతో ఆ వీధిలో ఉన్న ఆరు స్తంభాలు విరిగిపడ్డాయి. స్థానికులు విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే అక్కడికి చేరుకున్నారు. వృక్షాన్ని తొలగించి స్తంభాలను సరిచేసి విద్యుత్ను పునరుద్ధరించారు. మొత్తం మీద గంట సేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చెట్టు శిథిలావస్థకు చేరడంతో కూలింది. చెట్టు కూలినప్పుడు, విద్యుత్ స్తంభాలు విరిగినప్పుడు కానీ ఎటువంటి ప్రమాదం జరగపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
వాహనం ఢీకొని దుప్పి మృతి
గోపవరం : మండలంలోని నెల్లూరు – ముంబై జాతీయ రహదారిపై సెంచూరీ పానెల్స్ పరిశ్రమ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీకొని దుప్పి మృతి చెందింది. వాహనం ఢీకొన్న వెంటనే దుప్పి ప్రాణంతో ఉండటంతో స్థానికులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. గాయపడ్డ దుప్పిని రక్షించేందుకు అధికారులు ప్రయత్నించారు. కానీ భయంతో దుప్పి ప్రాణాలు విడిచింది. కాగా అటవీ ప్రాంతంలో ఉన్న వన్యప్రాణులు గ్రామాల్లోకి రావడం, సమీపంలో ఉన్న పంట పొలాల్లోకి వెళ్లడం పరిపాటిగా మారింది. అసలే వేసవికాలం కావడం, దీనికి తోడుగా కొండలకు నిప్పు పెట్టడంతో అక్కడ ఉన్న వన్యప్రాణులకు రక్షణ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే అటవీ ప్రాంతం నుంచి వచ్చిన దుప్పి రోడ్డు దాటుతుండగా వాహనం ఢీకొనడంతో మృత్యువాత పడింది.
మదనపల్లె టౌన్ : కుటుంబ సమస్యలతో ఓ యువకుడు వాస్మోల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో చేరాడు. బి.కొత్తకోట మండలం గట్టు గ్రామానికి చెందిన విజయ్(26) కుటుంబ సమస్యల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీంతో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఉన్న వాస్మోల్ పాయిజన్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.


