● యువతకు ఉపాధి కల్పించకుండా.. పిల్లల్ని కనమంటే ఎలా?
● మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి
ప్రొద్దుటూరు : మారిన జీవన పరిస్థితుల్లో ఒక్కో కుటుంబం ముగ్గురు పిల్లల్ని కని పోషించే పరిస్థితి ఉందా అని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం తన క్యాంప్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నలుగురు లేదా ఐదుగురు పిల్లల్ని కనమనే ప్రకటన ఎవరికి వర్తిస్తుందో అర్థం కావడం లేదన్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న వారి పరిస్థితి ఎలా అని ఆలోచన చేస్తున్నారన్నారు. మూడవ పిల్లవాడికి రూ.25 వేలు, నాలుగో పిల్లవాడికి రూ.50 వేలు ఇస్తామని చెబుతున్నారన్నారు. మూడో పిల్లవాడికి మీరిచ్చే రూ.25 వేలు డైపర్లకే సరిపోతుందని విమర్శించారు. ఆ రూ.25 వేలు కూడా ఇస్తారన్న నమ్మకం లేదన్నారు. తల్లికి వందనం పథకం కింద ఇంటిలో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి ఇస్తామని చెప్పి ఇప్పుడు ఇవ్వకుండా ఎగరగొట్టారని తెలిపారు. ముగ్గురు, నలుగురు పిల్లలను పుట్టించుకుంటే వారిని పెంచడానికి పేద, మధ్య తరగతి ప్రజలు పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. నేటి పరిస్థితుల్లో ఒకరికి మంచి విద్యను అందించడమే భారంగా మారిపోయిందని చెప్పారు. చంద్రబాబు ప్రజలకు ఇచ్చే ఈ సలహా వారి కొంప ముంచుతుందని అన్నారు. ముగ్గురు, నలుగురు పిల్లల్ని కని వారిని పోషించలేక భారమై తల్లిదండ్రులు వదిలేస్తే, వారు అసాంఘిక శక్తులుగా తయారవుతారని చెప్పారు. యువతకు ఉపాధి కల్పించకుండా పిల్లల్ని కనమని చెబితే ఎలా అని ప్రశ్నించారు. ఎంత మంది పిల్లలకు నాణ్యమైన విద్యను అందించగలరో అంత మంది పిల్లలను కనాలని తెలిపారు.


