ఒంటిమిట్ట : మండల పరిధి కొత్తమాధవరం గ్రామంలోని జాంబవంతుని వీధిలో శుక్రవారం తెల్లవారుజామున అక్రమంగా తరలిస్తున్న 142 బస్తాల రేషన్ బియ్యాన్ని కడప విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. కడప విజిలెన్స్ సీఐ శ్రీనివాసరెడ్డి తెలిపిన వివరాల మేరకు.. కడప రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ కరీముల్లా షరీఫ్ ఆదేశాల మేరకు కొత్తమాధవరం గ్రామం జాంబవంతుని వీధిలోని ఓ ఇంటిలో పీడీఎస్ రేషన్ బియ్యం డంపు చేసి, ఒక ఆటో సహాయంతో అక్రమంగా రవాణా చేయుచున్నారనే సమాచారంతో ఒంటిమిట్ట సివిల్ సప్లయ్ డిప్యూటీ తహసీల్దార్ సౌజన్యతో కలిసి కడప విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో కొలిమిగుండ్ల పద్మావతి అనే మహిళ ఒంటిమిట్ట మండలం చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజల వద్ద అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి, ఒక ఇంటిలో 142 బస్తాలుగా దాచిన 6,517 కేజీల పీడీఎస్ రేషన్ బియ్యాన్ని, రవాణాకు సహాయపడ్డ ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని ఒంటిమిట్ట సివిల్ సప్లయ్ డిప్యూటీ తహసీల్దార్కి అప్పగించారు. వీటి విలువ రూ.2,62,925 గా ఉంటుందని విజిలెన్స్ అధికారులు తెలిపారు. ఈ అక్రమ రవాణా చేస్తున్న కొలిమిగుండ్ల పద్మావతి, ఆటో డ్రైవర్ పి. గోవింద, సుబ్బరాజుపై ఒంటిమిట్ట పోలీసు స్టేషన్లో డిప్యూటీ తహసీల్దార్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు కడప విజిలెన్స్ సీఐ పి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో విజిలెన్స్ డీసీటీవో బి.బాబు మోజెస్, విజిలెన్స్ సిబ్బంది పాల్గొన్నారు.


