కమలాపురం : మండలంలోని కోగటం గ్రామంలో ఇద్దరు వ్యక్తులు అక్రమంగా మద్యం విక్రయించేందుకు సిద్ధంగా ఉంచిన 422 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామని కమలాపురం సీఐ మోహన్ తెలిపారు. మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. కోగటం గ్రామంలో అక్రమంగా మద్యం నిల్వ చేశారనే సమాచారం రావడంతో ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు డీఎస్పీ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో తాను కమలాపురం, వల్లూరు ఎస్ఐలు విద్యాసాగర్, శివనాగిరెడ్డి, సిబ్బందితో కలసి దాడులు నిర్వహించామన్నారు. ఇందులో భాగంగా లేవాక మాధవరెడ్డి వద్ద 205 బాటిళ్లు స్వాధీనం చేసుకుని అతడిని అరెస్ట్ చేసినట్లు వివరించారు. అలాగే మరో వ్యక్తి వద్ద 217 బాటిళ్లు స్వాధీనం చేసుకున్నామని, అయితే అతను పరారీలో ఉన్నాడన్నారు. అతడిని కూడా త్వరలోనే పట్టుకుంటామన్నారు. కాగా ఈ మద్యం సీసాలు కమలాపురం, పోట్లదుర్తి, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల తదితర ప్రాంతాల్లోని షాపుల నుంచి తీసుకున్నారని వివరించారు. ఆదివారం ఆ గ్రామంలో దేవర ఉన్నందున అధిక ధరలకు విక్రయించుకోవాలనే ఉద్దేశంతో వారు మద్యం బాటిళ్లను నిల్వ చేశారని సీఐ వివరించారు. కాగా అరెస్ట్ చేసిన మాధవరెడ్డిని కోర్టుకు హాజరు పరిచి రిమాండ్కు తరలించామన్నారు. ఈ సమావేశంలో ఎస్ఐ విద్యా సాగర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


