కడప కార్పొరేషన్: కడప నగరంలోని విద్యుత్ భవన్లో సోమవారం నిర్వహించిన ‘డయల్ యువర్ ఎస్ఈ’ కార్యక్రమానికి 5 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్ఈ రమణ తెలిపారు. ఈ సందర్భంగా ఖాజీపేట నివాసి, రిటైర్డ్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ గజ్జల మల్లారెడ్డి రెండు ముఖ్యమైన అంశాలను ప్రస్తావించారు. పగటి పూట వెలుగుతున్న వీధి దీపాలను ఆపివేయాలని, ఖాజీపేట మండలంలోని కొన్ని ప్రాంతాల్లో పగటి సమయంలో కూడా స్ట్రీట్ లైట్లు వెలుగుతున్నాయన్నారు. అలాగే మండలానికి శాశ్వత అసిస్టెంట్ ఇంజనీర్ నియామకం చేపట్టాలని, ఏఈ లేకపోవడం వల్ల పౌర సేవల్లో ఆలస్యం జరుగుతోందన్నారు. సూపరింటెండింగ్ ఇంజనీర్ ఎస్. రమణ స్పందిస్తూ వినియోగదారుల ఫిర్యాదులను గమనించి, సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈఈ మధుసూదన్, డీఈఈ నాగముని స్వామి, ఏఈ శ్యామ్ పాల్గొన్నారు.


