ఆటోమేటిక్కు గ్రీన్సిగ్నల్
రాజంపేట: ఇప్పటి వరకు స్నిగల్ వేస్తేనే రైలు ముందుకు కదులుతుంది...ఒక వేళ లోకో పైలెట్ అప్రమత్తంగా లేకుండా సిగ్నల్ దాటినా దానిని రైల్వేశాఖ తీవ్రంగా పరిగణిస్తూ వస్తోంది. రైల్వేశాఖ ఆధునాతమైన సాంకేతిక పరిజ్ఞానంతో ఆటోమేటిక్ సిగ్నల్ వ్యవస్థను తీసుకొచ్చింది. ముంబై–చైన్నె రైలుమార్గంలో వాడి నుంచి రేణిగుంట వరకు ఆటోమేటిక్ సిగ్నల్ వ్యవస్థను తీసుకొచ్చేందుకు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. అయితే స్టేషన్లో రైలు కదిలికకు మాత్రం స్టేషన్మాస్టర్ సిగ్నల్ ఇవ్వాల్సిందేనని రైల్వే నిపుణులు చెపుతున్నారు. రెండుస్టేషన్ల మధ్య సెక్షన్లో ఈ సిగ్నల్స్ను ఏర్పాటుచేస్తున్నారు.
జిల్లా రైల్వేలైన్లో..
జిల్లా రైల్వేలైన్ (ముంబై–చైన్నె రైలుమార్గం)లో ముద్దనూరు–ఎర్రగుడిపాడు, ఎర్రగుడిపాడు–కడప, కడప–మంటపంపల్లె,నందలూరు–పుల్లంపేటమధ్య ఆటోమేటిక్ సిగ్నల్ వ్యవస్థను తీసుకొస్తున్నారు. ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తే గంటకు 18రైళ్లు నడుపుకోవచ్చునని రైల్వేవర్గాలు చెపుతున్నాయి.
రాకపోకలు సులభతరం..
స్టేషన్ల మధ్య ఉన్న సెక్షన్లో రైళ్ల రాకపోకలు సులభతరం చేయడానికి రైల్వేశాఖ ఈ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందుకోసం కోట్లాదిరూపాయిలు వ్యయం చేస్తోంది. ఏప్రిల్ మాసంలో ఈ వ్యవస్థను తీసుకొచ్చేలా యుద్ధప్రాతిపదకన పనులు చేపట్టారు. గతంలో స్టేషన్ నుంచి మరో స్టేషన్కు వెళ్లే సమయంలో రైలు స్టేషన్ దాటితేనే మరో రైలుకు సిగ్నల్ ఇస్తుంటారు. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. స్టేషన్ల మధ్య ఉన్న సెక్షన్లో రైలు నడిచేందుకు వీలుగా ఆటోమేటిక్ సిగ్నల్స్ పడిపోతుంటాయి. మెట్రోరైల్వేవారు ఇప్పటికే ఈ వ్యవస్థను తీసుకొచ్చారు. ఇప్పుడు ముంబై–చైన్నె రైలుమార్గంలో తీసుకొస్తున్నారు.
నందలూరు సెక్షన్లో స్పిక్ పరిశీలన
నందలూరు రైల్వేకేంద్రం పరిధిలో ఈనెల 19న స్పిక్ (సెల్ఫ్ ప్రొఫైల్డ్ ఇన్స్పెక్షన్ కార్) ఆటోమేటిక్ సిగ్నల్ వ్యవస్థను పరిశీలించింది. ఈ స్పిక్లో సౌత్సెంట్రల్ జోన్ ఆయా విభాగాల ఉన్నతాధికారుల బృందం పర్యటించింది. ఒకరకంగా ఆటోమేటిక్ సిగ్నల్ వ్యవ స్థ పనులపై ట్రయల్ రన్ చేసింది. ప్రతి ఒక్క కిలోమీటర్కు రెండు బండ్లను నడిపించేలా రూపుదిద్దుతున్నారు.మార్చి 31 నాటికి మంటపంపల్లె–పుల్లంపేట మధ్య పనులు పూర్తి చేసే విధంగా దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారులు ముందుకు సాగుతున్నారు.


