ఇలా కట్టారు.. అలా కూలింది
● సౌమ్యనాథాలయంలో సంఘటన
● నిర్మాణంలో నాసిరకమే ప్రహరీ కూలివేతకు కారణమా?
● భక్తులు లేకపోవడంతో తప్పిన ప్రమాదం
● కేంద్ర పురావస్తుశాఖ నిర్లక్ష్యమే అంటున్న భక్తులు
రాజంపేట : దక్షిణ భారత దేశంలో అతిపెద్ద వైష్ణవ ఆలయాలలో నందలూరు సౌమ్యనాథాలయం ఒకటి. ఈ ఆలయంలో ప్రాచీన ప్రహరీ (ఆలయం ఉత్తర గాలి గోపురం) నిర్మించిన మూడు రోజులకే కూలిపోయింది. ఆదివారం సాయంత్రం ఆ ప్రహరీ కుప్పకూలిపోవడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
అదేంటీ ఇలా కట్టారు.. అలా కూలిపోయింది అంటూ పెదవి విరుస్తున్నారు. అయితే ఆ సమయంలో అటుగా భక్తులు ఎవరూ వెళ్లకపోవడంతో ప్రమాదం తప్పినట్లైంది. ప్రహరీ నిర్మితం విషయంలో కేంద్ర పురావస్తుశాఖ నిర్లక్ష్యంపై భక్తులు పెదవివిరిచారు. సౌమ్యనాథాలయం అభివృద్ధికి ఇప్పటికే కేంద్రపురావస్తుశాఖ అడ్డంకిగా నిలుస్తోందన్న అపవాదును మూటకట్టుకుంది. టీటీడీ చేపట్టాలనుకున్న అభివృద్ధికి కూడా కేంద్రపురావస్తుశాఖ ఆంక్షలే కారణమన్న విమర్శలు వెలువడుతున్నాయి.
నాసిరకమే గోడ కూలడానికి కారణమా?
ఆలయంలో ప్రహరీ నిర్మాణం నాసికరంగా చేపట్టడమే కార ణమా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాచీన ప్రహరీ పునఃనిర్మితంలో సున్నం వాడతారు. అదే విధంగా ఆలయం ప్రహరీ నిర్మాణం జరిగినప్పటికీ, సున్నంతో ప్రహరీ బలంగా ఉండేందుకు తీసుకోవాల్సిన విషయంలో జాగ్రత్తలు పట్టించుకోలేదన్న ఆరోపణలు వెలువడుతున్నాయి. గోడ నిర్మితం కాగానే, అప్పుడే ప్రహరీపై క్రేన్ తీసుకొచ్చి, రాతి బండలు పెట్టేందుకు ప్రయత్నించే సమయంలో బలహీనంగా ఉన్న గోడలు కూలిపోయాయని భక్తులు చెపుతున్నారు.
కూలిన సంఘటనకు మూడేళ్లు..
కాగా సౌమ్యనాథాలయంలో 2023లో వైకుంఠ ఏకాదశి ముందురోజున ఆలయ ప్రాచీన ప్రహరీ కూలిపోయింది. అప్పుడు కూడా భక్తులు అటుగా వెళ్లకపోవడంతో పెద్దప్రమాదం తప్పిందని భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాళ్లు రప్పలతో ఉండిపోయింది. ప్రహరీ నిర్మితంపై కేంద్రపురావస్తుశాఖ నిర్లక్ష్యంపై సాక్షిలో పలుమార్లు కథనాలు ప్రచురితమయ్యాయి. నిర్మాణం చేపట్టేందుకు కేంద్రపురావస్తుశాఖ టెండర్లు కూడా పిలిచారు. పనులు చేపట్టే విషయంలో మొన్నటి వరకు జాప్యం కొనసాగుతూ వచ్చింది. ఎట్టకేలకు తిరుమల తిరుపతి దేవస్థానం జోక్యం చేసుకొని ప్రహరీ నిర్మితం చేయాలని కేంద్రపురావస్తుశాఖ పై ఒత్తిడి తీసుకువచ్చినట్లు తెలిసింది. దీంతో ప్రహరీ నిర్మాణ పనులు చేపట్టారు. చేపట్టిన మూడు రోజులకే కూలిపోయింది.
ఒకొక్కసారి అలా జరుగుతుంటుంది :
కేంద్రపురావస్తుశాఖ సీఎ
కేంద్ర పురావస్తుశాఖ కన్జర్వేటర్ అసిస్టెంట్ డాకారెడ్డి మంగళవారం సౌమ్యనాథాలయంలో మకాం వేశారు. కూలిన ప్రహరీ విషయంపై దగ్గరుండి పర్యవేక్షించారు. కూలిన సంఘటనపై ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ గోడ నిర్మితం సక్రమంగానే చేపట్టామన్నారు. ఒకొక్కసారి అలా జరుగుతుంటుందని తెలిపారు. ఇది సర్వసాధారణమే అని కొట్టిపారేసారు. ఈయనతోపాటు కడప కేంద్రపురావస్తుశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
ఇలా కట్టారు.. అలా కూలింది


